ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే.. ఈటలతో సమావేశమైనవారంతా అవకాశవాదులే :ఎన్నారై టీఆర్ఎస్
భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాక ఈటల రాజేందర్ ప్రజల్లోకి వెళ్లి అన్ని వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ కోసం తన నియోజకవర్గంతో పాటు తెలంగాణవ్యాప్తంగా తన అభిమానులు,శ్రేయోభిలాషులతో మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ ఎన్నారైలతోనూ ఆయన వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన కొద్ది గంటలకే టీఆర్ఎస్ ఎన్నారై సెల్ నుంచి కీలక ప్రకటన వెలువడింది.
ఎన్నారైలతో ఈటల సమావేశం విడ్డూరం..
తెలంగాణ ఎన్నారైలంతా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెంటే ఉన్నారని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ప్రకటించారు.అమెరికాలోని కొంతమంది ఎన్నారైలతో ఈటల రాజేందర్ జూమ్ ద్వారా సమావేశమైనట్లు వార్తల్లో చూశానని... వారంతా నిన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారేనని తెలిపారు. ఈటల 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మాట సాయం చేయనివారు సమావేశం నిర్వహించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈటలతో సమావేశమైన ఎన్నారైలను చూసి పలువురు నవ్వుకుంటున్నారని అనిల్ పేర్కొన్నారు.
దమ్ముంటే ఆ విషయం చెప్పండి : ఈటల
ఎన్నారైలు ఎప్పుడూ అవినీతి రహిత సమాజాన్ని కోరుకుంటారని అనిల్ కూర్మాచలం తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలను స్వాగతిస్తున్నామని, తామంతా కేసీఆర్ వెంటే ఉన్నామని తేల్చి చెప్పారు. కొంతమంది అవకాశవాదులే ఈటలతో సమావేశం పెట్టారని ఆరోపించారు. దమ్ముంటే ఈటలకు నేటి వరకు ఏ రకంగా అండగా ఉన్నారో చెప్పాలని అనిల్ వారికి సవాల్ విసిరారు. ఈటలతో జూమ్ ద్వారా మాట్లాడిన ఎన్నారైలంతా టీఆర్ఎస్ వ్యతిరేకులు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు అని అనిల్ కూర్మాచలం స్పష్టం చేశారు.
బీసీ బిడ్డగా నాకు గౌరవమిచ్చారు : ఈటల
రాష్ట్రంలోనే కాదు దేశం బయట కూడా సామాజిక న్యాయం పాటించి ఎన్నో దేశాల్లో బలహీన వర్గాలకు చెందిన కార్యకర్తలకు అధ్యక్ష పదవులు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. ఒక బీసీ బిడ్డగా తనకు కేసీఆర్ ఎంతో గౌరవమిచ్చి ఉద్యమ సమయంలో ఎన్నారై టీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. ఇతర పార్టీ ఎన్నారై శాఖల్లో సామాజిక న్యాయం లేదని విమర్శించారు.
అంతకుముందు,ఎన్నారైలతో సమావేశమైన ఈటల రాజేందర్... ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే తనపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసం కాదని... తాను ఎంగిలి మెతుకుల కోసం ఆశపడనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.2014కు ముందు సాగినట్లే రాష్ట్రంలో ఇప్పుడు కూడా పాలన సాగుతోందన్నారు.లంగాణ వాదుల భాగస్వామ్యం లేకుండా ఇష్టం వచ్చినట్లు పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు.