ప్రచారంతో హోరెత్తించనున్న కూటమి..! గ్రేటర్ లో టీడిపి ముఖ్యనేతల జోరు..!!
హైదరాబాద్ : తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాలని రెడీ అవుతోంది. ముఖ్య నేతలతో ప్రచార జోరు పెంచేందుకు తెలుగుతమ్ముళ్లు సిద్ధం అవుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, హిందుపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం లు ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలను పార్టీ సిద్ధం చేస్తోంది. ప్రధానంగా తెలంగాణలో పోటీ చేస్తున్న పదమూడు నియోజక వర్గాలతో పాటు కూకట్ పల్లి నియోజక వర్గాన్ని టీడిపి నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
తెలంగాణాలో కూటమి ప్రచారానికి బాబు..! రాహూల్ తో కలిసి సభల్లో పాల్గొనే చాన్స్..!!
మహా కూటమి తరపున బరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ కీలక నేతలు ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. తెలంగాణా నేతలు ఇప్పటికే ప్రచారంలో బిజి, బిజిగా గడుపుతుండడంతో ఏపీ నేతలను కూడా రంగంలోకి దించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అభ్యర్థులు 13 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నా.. గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గాల పై పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. నగర శివారు నియోజకవర్గాల్లో మరోసారిపట్టు నిలుపుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. కూకట్ పల్లిలో నందమూరి సుహాసిని రంగంలో దిగడంతో ఆ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
కూకట్ పల్లి పై తెలుగుదేశం ప్రత్యేక దృష్టి..! రంగంలో దిగనున్న బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లు..!
మహా కూటమి అభ్యర్థుల విజయం కోసం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఈ నెల 28, 29 తేదీల్లో మొదటి విడత పర్యటన చేస్తున్నారు. ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లో బాబు పర్యటన ఖరారయ్యే చాన్స్ ఉంది. రాహూల్ గాంధీ కూడా ఆ రెండు రోజులు తెలంగాణాలో పర్యటిస్తున్న నేపథ్యంలో రాహూల్ పాల్గొనే సభల్లో బాబు పాల్గొంటారు. అందుకోసం తెలంగాణ టీడిపి రూట్ మ్యాప్ ను కూడా సిద్దం చేసినట్టు తెలుస్తోంది. బాబుతో పాటు తెలంగాణ ముఖ్య నేతలు కూడా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ టీడిపి.
సీమాంధ్ర ప్రజలకు చేరువయ్యేందుకు టిడిపి ప్లాన్.! రంగంలోకి పరిటాల సునీత..!!
30వ తేదీ అనంతరం నందమూరి బాలకృష్ణ కూడా తెలంగాణాలో పర్యటించి మహా కూటమి తరపున ప్రచారం నిర్వహించనున్నారు. కూకట్ పల్లి లోపార్టీ అభ్యర్థి విజయం కోసం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాంలు ప్రచారం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నా....ఇంకా అధికారికంగా షెడ్యూల్ ఖరారు కాలేదు. కూకట్ పల్లిలో సీమాంధ్రప్రజలను ఆకట్టు కునేందుకు ఏపీ మంత్రి పరిటాల సునిత మంగళ, బుధవారాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఒకటి, రెండు తేదీల్లో ఎంపీ రామ్మెహన్ నాయుడు కూకట్ పల్లిలో పర్యటించనున్నారు. బాబు బహిరంగ సభలతో పాటు రోడ్ షోల్లో పాల్గొంటరని టిడిపి నేత కంభం పాటి రామ్మోహన్ రావ్ వెల్లడించారు.
రాబోయే పదిరోజులు కీలకం..! ఎంత ప్రచారం చేసుకుంటే అన్ని ఓట్లు..!!
రాబోయే వారం పది రోజుల పాటు కీలక నేతల పర్యటనలను ఏర్పాటు చేసి తెలంగాణాలో మహ కూటమి అభ్యర్థుల విజయం కోసం పార్టీ నేతలు ప్రచార జోరు పెంచేందుకు ప్రణాళికలను పార్టీ రచిస్తోంది. అవసరమైతే చంద్రబాబు మరోసారి గ్రేటర్ లో పర్యటించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. బాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు, నారా కుటుంబ సభ్యులు కూడా సుహానికి అండగా ఉడబోతున్నట్టు తెలుస్తోంది. నారా లోకేష్ తో పాటు బ్రహ్మిణి, కళ్యాణ్ రాం భార్య దీపిక కూడా సుహాసినికి అనుకూలంగా ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది.