'నిజం' పట్టేశారు: విక్రమ్ కాల్పుల మిస్టరీలో సంచలన విషయాలు.. అలా గట్టెక్కడానికే?
అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాను తిరిగి కుటుంబానికి దగ్గరయితేనే సమస్యల నుంచి గట్టెక్కవచ్చునని విక్రంగౌడ్ భావించారు.
హైదరాబాద్: ఒక డ్రామా.. ఒక సెన్సేషన్.. సానుభూతి కోసం తాపత్రయం. మాజీమంత్రి, కాంగ్రెస్నేత ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రంగౌడ్పై కాల్పుల వ్యవహారంలో నిగ్గు తేలిన నిజమిదే అంటున్నారు. నిజానికి ఏ అగంతకులో.. దుండగులో.. విక్రంగౌడ్ ను టార్గెట్ చేయలేదు.
తనకు తానుగా పక్కా ప్లాన్ ప్రకారం విక్రంగౌడే కాల్పులు చేయించుకున్నాడు. కేసును విచారిస్తున్న 10కి పైగా ప్రత్యేక బృందాలు విక్రంగౌడ్ చెప్పిన మాటల్లో నిజం లేదని తేల్చినట్లు తెలుస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాను తిరిగి కుటుంబానికి దగ్గరయితేనే సమస్యల నుంచి గట్టెక్కవచ్చునని విక్రంగౌడ్ భావించారు.
తన కుటుంబం తనను సానుభూతితో అక్కున చేర్చుకోవాలంటే.. తనకేదైనా జరిగి.. వారు చలించిపోవాలని భావించాడు. ప్రాణపాయం లేకుండా స్వల్ప గాయాలతో బయటపడేలా తనపై దాడికి తానే వ్యూహా రచన చేసుకున్నట్లు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు.
పక్కా స్కెచ్:
రోజురోజుకు అప్పులవాళ్ల ఒత్తిడి పెరుగుతుండటంతో.. విక్రమ్ గౌడ్ తీవ్ర మనోవేదనకు గురవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కుటుంబానికి దగ్గరయ్యి.. అప్పుల నుంచి గట్టెక్కాలని భావించారు. ఇందుకోసం తనపై సానుభూతి కలిగేలా ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేయాలని భావించారు.
అనుకున్నట్లుగానే తనపై దాడి చేసేందుకు అనంతపురానికి చెందిన ఓ ముఠాకు విక్రమ్ గౌడ్ స్వయంగా సుపారీ ఇచ్చుకున్నారు. తనకున్న పాత పరిచయాలతో అనంతపురానికి చెందిన ముగ్గురు వ్యక్తుల సహాయం కోరాడు.
Recommended Video
ఆ ముగ్గురితోనే అర్థరాత్రి వరకు:
విక్రమ్ గౌడ్ నుంచి సుపారీ అందుకున్న ముగ్గురు 27వ తేదీన ఉదయం హైదరాబాద్ చేరుకొని జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేటు గెస్ట్హౌస్ లో మకాం వేశారు. ఆరోజు రాత్రి 9గం.కు ఇంటి నుంచి బయటకెళ్లిన విక్రమ్ గౌడ్.. అర్థరాత్రి 2గం. ప్రాంతంలో ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటిదాకా విక్రమ్ గౌడ్ వారితోనే గడిపారు.
ఇంటికి వచ్చీ రాగానే.. పైన అంతస్తులో నిద్రిస్తున్న భార్య వద్దకు వెళ్లారు. సమీపంలోని దర్గా వద్దకు వెళ్లి బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజాము2.30-3.00గం. ప్రాంతంలో పూజలు చేయాలని చెప్పాడు. భార్యను రెడీ అవమని చెప్పి విక్రమ్ గౌడ్ కిందకు వెళ్లిపోయారు.
ప్లాన్ ప్రకారం చొరబడ్డారు:
భార్యను సిద్దం కావాలని కిందకు వెళ్లిన విక్రమ్ గౌడ్.. డ్రాయింగ్ రూమ్లో ఆమె కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం.. సుపారీ తీసుకున్న ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. అయితే.. ఆ సమయంలో కాల్పులు జరిగిన మాత్రం.. వారు జరిపినవి కాదని పోలీస్ వర్గాలు చెబుతుండటం గమనార్హం.
ప్రాణపాయం లేకుండా ఉండేందుకు విక్రమ్ గౌడే స్వయంగా తనకు తాను కాల్పులు జరుపుకున్నట్లు పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి. ముఠాలోని వ్యక్తులు కాల్పులు జరిపితే తుపాకీ నుంచి వచ్చిన తూటా విక్రమ్ శరీరం నుంచి.. వెనకాల ఉన్న గోడకైనా, మరే వస్తువుకైనా తగలాలి. కానీ ఇక్కడ అలాంటిదేమి జరగకపోవడంతో.. ఈ అనుమానానికి మరింత బలం చేకూరుతోంది.
రెండు వైపులా కాల్చుకుని:
విక్రమ్ గౌడ్ తొలుత కుడిచేత్తో ఎడమ భుజాన్ని కాల్చుకుని ఉంటారని, ఆ సమయంలో బుల్లెట్ భుజానికి చీల్చుకుంటూ నేల వైపునకు దూసుకెళ్లిందని.. రెండోసారి ఎడమచేత్తో కుడి భుజానికి కాల్చుకోగా, తుపాకీ గురితప్పి బుల్లెట్ దిశ మారి కడుపులోకి దూసుకెళ్లిందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మొత్తానికి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని విక్రమ్ గౌడ్ వాంగ్మూలంలో, ఆయన భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిజం లేదనేది పోలీసుల అభిప్రాయంగా తెలుస్తోంది.
కాల్ డేటాతో దొరికిపోయారు:
విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీని చేధించేందుకు 10 ప్రత్యేక విచారణ బృందాలు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయి. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులకు విక్రమ్ గౌడ్, ఆయన భార్య షిపాలీ చెప్పిన వివరాలతో ఎక్కడా పొంతన కుదరలేదు.
కాల్పులు జరిగిన రోజు ఆ ప్రాంతంలోని సెల్ టవర్స్ నుంచి వెళ్లిన కాల్స్ వివరాలు సేకరించారు. కాల్పులకు మూడు రోజుల ముందు నుంచి విక్రమ్ గౌడ్కు ఓ నంబర్ నుంచి ఎక్కువసార్లు కాల్స్ రావడంతో పోలీసులు దానిపై ఫోకస్ పెట్టారు. అక్కడి నుంచి కూపీ లాగితే వారి మూలాలు అనంతపురంలో బయటపడ్డాయి.
కాగా, తన కష్టాలకు బాబాయే కారణమంటూ విక్రమ్ గౌడ్ పదే పదే చెబుతుండటంతో.. ఆయనకు కూడా నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమవుతున్న విక్రమ్.. వాటి నుంచి బయటపడేందుకే కాల్పుల డ్రామాను క్రియేట్ చేసినట్లుగా పోలీసులు ఒక అంచనాకు వచ్చేశారు.