CM KCR: యాదగిరిగుట్ట నరసింహుడిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు..
సీఎం కేసీఆర్ తో పాటు దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, పినరయి విజయన్ సహా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. నిన్న రాత్రే హైదరాబాద్కు విచ్చేసిన ముఖ్యమంత్రులు ఉదయం ప్రగతిభవన్కు చేరుకుని అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు జాతీయ రాజకీయాలు, సంబంధిత అంశాలపై ఈ నేతలు చర్చించారు.
హెలికాప్టర్
విందు తర్వాత నలుగురు ముఖ్యమంత్రులు, మాజీ సీఎం.. బేగంపేట నుంచి హెలికాప్టర్లలో యాదగిరిగుట్టకు వెళ్లారు. వారంతా యాదగిరిగుట్టలో నేరుగా ప్రెసిడెన్షియల్ సూట్లకు చేరుకున్నారు. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ విశిష్టత
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ విశిష్టతను నేతలకు వివరించారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎంతో పాటు మంత్రి తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత ఉన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ నేత డి. రాజా యాదగిరి గుట్టకు వెళ్లినా స్వామివారి దర్శనానికి మాత్రం వెళ్లలేదు. వీరంతా కాసేపట్లో ఖమ్మం చేరుకోనున్నారు.
కంటి వెలుగు
సీఎం కేసీఆర్ ఖమ్మంలో నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం చేయనున్నారు. తర్వాత కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కలెక్టరేట్లోనే భోజనం చేయనున్నారు. అతిథుల భోజనం కోసం భారీ మెనూ కూడా సిద్ధం చేశారు. 17 రకాల మాంసాహార, 21 రకాల శాకాహార వంటలతో భోజనాలు పెట్టనున్నారు.
భక్తుల ఇబ్బంది
సీఎం కేసీఆర్ యాదగిరి గుట్ట పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 1600 మంది పోలీసులను భద్రతలో పాల్గొన్నారు. అయితే ముఖ్యమంత్రుల రాక సందర్భంగా భక్తులు కాస్త ఇబ్బంది పడ్డారు.