తెలంగాణాలో బీఆర్ఎస్ టైమ్ అయిపోయింది: కేసీఆర్ ని టార్గెట్ చేసిన అమిత్ షా!!
తెలంగాణలో జరగనున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని బీజేపీ అగ్రనేత, హోం శాఖా మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణా ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హోం మంత్రి అమిత్ షా కెసిఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. కెసిఆర్ హయాంలో స్కాములు వెలుగులోకి వచ్చాయని మిషన్ భగీరథ, మద్యం కుంభకోణం, కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం బయటపడ్డాయని, దేశంలోనే కెసిఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వమని ఆయన విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ టైం అయిపోయిందని, బిజెపి టైం వచ్చిందని తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. అబద్ధపు మాటలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ దళితుడిని సీఎం చేయలేదని అమిత్ షా పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి విఆర్ఎస్ ఇచ్చే టైం వచ్చిందని అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్న అమిత్ షా, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు అన్నీ ఒకటేనని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు బీసీ వ్యతిరేక పార్టీలని పేర్కొన్న అమిత్ షా, తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు.
తెలంగాణలోని బీసీలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని అమిత్ షా అన్నారు. తెలంగాణలో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది బీజేపీయేనని, మోదీ మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు చోటు కల్పించామని చెప్పారు. బీసీ వ్యక్తిని దేశ ప్రధానిగా చేసిన ఘనత బీజేపీది అని పేర్కొన్నారు.
తెలంగాణలో పోటీపరీక్షల పేపర్ లీకేజీలతో అమాయక యువత బలై పోతుందని అమిత్ షా మండిపడ్డారు. తెలంగాణలోని బీజేపీని గెలిపిస్తే ఐదేళ్లలో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని, ఆ రద్దు చేసిన రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామన్నారు.












Click it and Unblock the Notifications