ఆదిలాబాద్లో 28న అమిత్ షా పర్యటన: భారీ బహిరంగ సభ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కోసం జాతీయ నేతలు కూడా రంగంలోకి దిగుతున్నారు. జనవరి 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. ఇందు కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా కోర్ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా ప్రభారీ అల్జాపూర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ జిల్లాల అధ్యక్షులు పాయల్ శంకర్, డా. శ్రీనివాస్, అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్ తదితరులు హాజరయ్యారు. అమిత్ షా సభ ఏర్పాట్లు, విజయవంతంపై చర్చించారు.
28న ఆదిలాబాద్ నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. తమ ఆదిలాబాద్ నుంచి పార్లమెంట్ ప్రవాస్ యోజన ప్రారంభంపై ఎంపీ సోయం బాపు రావు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్లోని పదికి పది స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇందులో తాము పక్కా ఫ్లాన్తో ముందుకు వెళుతున్నామని ఎంపి సోయం బాపురావు తెలిపారు. కాగా, అమిత్ షా పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్సభలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు, మండల, ఇతర స్థాయి కమిటీల నియామకంపై సమీక్షిస్తారు.