మోహన్ బాబుపై ఎఫ్ఐఆర్..!!
Mohan Babu: కుటుంబంలో ఆస్తి తగాదాలను ఎదుర్కొంటోన్నారు ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు. ఆస్తి పంపకాల వ్యవహారంలో చిన్న కొడుకు మంచు మనోజ్, కోడలు భూమా మౌనిక రెడ్డితో ఘర్షణ పడుతున్నారు. ఈ గొడవలు కాస్తా రచ్చకెక్కాయి. విభేదాలు వీధిన పడ్డాయి. అభిప్రాయభేదాలు భగ్గుమన్నాయి.
భూమా మౌనిక రెడ్డిపై తండ్రి మోహన్ బాబు దాడి చేశారంటూ మంచు మనోజ్ ఇదివరకే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తననూ కొట్టాడంటూ మనోజ్ లిఖిత పూరకంగా పహాడీ షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీనికి ప్రతిగా మోహన్ బాబు కూడా మంచు మనోజ్పై ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్కు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. మనోజ్ వల్ల తనతో పాటు భార్య ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీన తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు అలజడి సృష్టించారని, భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు.
దీని తరువాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఈ గొడవల నేపథ్యంలో దుబాయ్లో ఉన్న మోహన్ బాబు పెద్ద కుమారుడు, నటుడు మంచు విష్ణు హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారు. కొద్దిసేపటి కిందటే జల్పల్లి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆయన తమ్ముడు మనోజ్.. గేటు వద్దే బైఠాయించారు. ఆయనతో మాట్లాడకుండా లోనికి వెళ్లారు.
జల్పల్లిలోని మంచు టౌన్ షిప్ వద్ద మంగళవారం రోజంతా హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి వరకూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయక్కడ. పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకూ వెళ్లాయి. మంచు విష్ణు-మనోజ్కు చెందిన బౌన్సర్లు పరస్పరం తోసుకున్నారు. ఒకదశలో కొట్టుకున్నారు కూడా.
అదే సమయంలో మోహన్ బాబు సైతం రంగంలోకి దిగారు. తన ఫ్రస్ట్రేషన్ మొత్తాన్నీ మీడియాపై చూపించారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్కు చెందిన విలేకరి ముప్పిడి రంజిత్ కుమార్పై దాడి చేశారు. మైక్తో బలంగా కొట్టారు. ఈ ఘటనలో ఆయన తలకు గాయమైంది. స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్లో తేలింది.
తనపై జరిగిన దాడికి నిరసనగా రంజిత్.. మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నంబర్ 645/2024 నమోదు చేశారు. భారత్ న్యాయ సంహితలోని సెక్షన్ 118 (1) కింద కేసు ఫైల్ చేశారు.












Click it and Unblock the Notifications