టీఆర్ఎస్కు షాక్: హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో చైర్మెన్గా అనంత నరసింహారెడ్డి విజయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఛైర్మెన్ పదవికి పోటీచేసిన టీఆర్ఎస్ ప్రతిపాదిత అభ్యర్థి గండ్ర మోహన్రావు ఓటమిపాలయ్యారు. గండ్ర మోహన్ రావు పై అనంత నరసింహారెడ్డి రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక వైస్ ఛైర్మెన్ పదవికి జరిగిన ఎన్నికల్లో సునీల్ గౌడ్, దుస్సా జనార్ధన్లు పోటీపడ్డారు. అయితే ఈ ఎన్నిక టై గా ముగిసింది. సునీల్ గౌడ్, దుస్సా జనార్ధన్లకు సమాన ఓట్లు రావడంతో ఎన్నిక డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఏడాది వైస్ ఛైర్మెన్గా సునీల్ గౌడ్ ఉండగా... రెండవ ఏడాది ఆ బాధ్యతలను దుస్సా జనార్ధన్ చేపడతారు.
టీఆర్ఎస్ ప్రతిపాదిత సభ్యుడు గండ్ర మోహన్ రావు ఓటమితో టీఆర్ఎస్ పార్టీకి న్యాయవాదులు క్రమంగా దూరం అవుతున్నారని చెప్పేందుకు ఇదే నిదర్శనం అని న్యాయవాదుల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్యమసమయంలో న్యాయవాదులు టీఆర్ఎస్ వెన్నంటే ఉండి నడిచారు.రాష్ట్రంలో 25వేలకు పైగా ఉన్న న్యాయవాదులు జూన్ నెలలో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొన్నారు. అందులో ఎన్నికైన 25 మంది సభ్యులు సుప్రీం కోర్టు ఆదేశం మేరకు శనివారం ఛైర్మెన్ ,వైస్ ఛైర్మెన్లను ఎన్నుకున్నారు.
న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. అందులో సగం మందికే ఇన్ష్యూరెన్స్ కల్పించినట్లు సమాచారం. మిగతా సగం మందిని విస్మరించడంతోనే ఆగ్రహం చెందిన న్యాయవాదులు టీఆర్ఎస్ ప్రతిపాదించిన గండ్రమోహన్ రావుకు కాకుండా అనంత నరసింహారెడ్డి వైపు మొగ్గు చూపారనే వాదన వినిపిస్తోంది.