తమన్నా పోయి అనసూయ వచ్చె: లక్కీ ఛాన్స్ కొట్టిన టాప్ యాంకర్
హైదరాబాద్: మాస్టర్ ఛెఫ్ టీవీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తోన్న టాలీవుడ్ నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తప్పుకొన్నారు. ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీలో టెలికాస్ట్ అవుతోన్న ఈ షోలో ఇక తమన్నా స్థాన్నాన్ని టాప్ యాంకర్ భర్తీ చేశారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా మొదలైంది. ఆ యాంకర్- అనసూయ భరద్వాజ్. శనివారం ప్రసారం అయ్యే షోలో తమన్నా కనిపించరు. ఆమె స్థానంలో అనసూయ హోస్ట్గా వ్యవహరిస్తారు.
ఓ టెలివిజన్ కార్యక్రమానికి హోస్ట్గా పని చేయడం తమన్నా భాటియాకు ఇదే తొలిసారి. ఈ షోకు మంచి గుర్తింపే వచ్చింది. తన హస్కీ వాయిస్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముందుగా కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. తొలి సీజన్ ముగిసేంత వరకు తమన్నా- ఈ టీవీ షోనకు హోస్ట్గా వ్యవహరించాల్సి ఉంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం.. 18 రోజుల పాటు సమయాన్ని కేటాయించారు తమన్నా. ఈ 18 రోజుల్లోగా తొలి సీజన్ ఎపిసోడ్లను ముగించాల్సి ఉంది.
జెమినీ ఛానల్ యాజమాన్యం మాత్రం ఆమె ఇచ్చిన డేట్స్కు అనుగుణంగా ఈ 18 రోజల షూటింగ్ను కంప్లీట్ చేయలేకపోయింది. దీనితో ఆమె తన రెమ్యునరేషన్ను పెంచారని, ఇలా మధ్యలోనే రెమ్యునరేషన్ను పెంచడం అగ్రిమెంట్లో కుదుర్చుకున్న క్లాజ్లకు విరుద్ధమని సదరు టీవీ యాజమాన్యం భావించింది. రెమ్యునరేషన్ పెంచలేమంటూ స్పష్టం చేయడంతో- ఈ ప్రోగ్రామ్ నుంచి తమన్నా భాటియా తప్పుకొన్నారని చెబుతున్నారు.
దీనితో తొలి సీజన్లో ఇంకా మిగిలివున్న ఎపిసోడ్లను ఎవరు హోస్ట్ చేస్తారనే విషయంపై జెమినీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అన్వేషించింది. అనసూయ భరద్వాజ్ వారి దృష్టి పడ్డారు. దీనితో హోస్ట్గా అనసూయ భరద్వాజ్ను పెట్టి మాస్టర్ ఛెఫ్ తొలి సీజన్లోని మిగిలిన ఎపిసోడ్లను లాగించేస్తోంది టీవీ ఛానల్ మేనేజ్మెంట్. ఇంకొన్ని రోజుల్లో ఈ షో మొదటి సీజన్ పూర్తికానుంది. ఇప్పటికే బెంగుళూరులో నిర్వహించిన ఓ ఎపిసోడ్ షూటింగ్లో అనసూయ పాల్గొన్నారు కూడా.
నిజానికి- జెమినీ ఛానల్ యాజమాన్యం మాస్టర్ చెఫ్, మీలో ఎవరు కోటీశ్వరుడు షోలను ఒకేసారి మొదలు పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్.. మీలో ఎవరు కోటీశ్వరుడు షోనకు హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. ఒకేసారి మొదలైన ఈ రెండు షోలను టాప్ టాలీవుడ్ యాక్టర్లను హోస్ట్గా తీసుకుంది. తమన్నా భాటియా మధ్యలోనే డ్రాప్ కావాల్సి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన మీలో ఎవరు కోటీశ్వరుడును కొనసాగిస్తున్నారు.