హైకోర్టు తీర్పు: సెట్టాప్ బాక్సుల గడువు మరో 2 నెలల పొడిగింపు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కేటుల్ టీవి డిజిటలైజేషన్కు రెండు నెలలు గడువు పొడిగిస్తున్నట్లు హైకోర్టు బుధవారం ప్రకటించింది. నిజానికి సెట్టాప్ బాక్స్ కోసం (టీవీ డిజిటలైజేషన్కు) గతంలో ప్రకటించిన గడువు రేపటి(డిసెంబర్ 31)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సెట్టాప్ బాక్సుల కొరత ఉన్నందున గడువు పొడిగించాలని తెలంగాణ ఎంఎస్ఓల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
85 శాతం ప్రజలకు కేంద్రం సెట్టాప్ బాక్సులను సరఫరా చేయలేదని పిటిషన్లో వారు పేర్కొన్నారు. ఈ పిటిషన్ను బుధవారం విచారించిన హైకోర్టు సెట్టాప్ బాక్స్ అమర్చుకోవడానికి మరో రెండు నెలల గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేబుల్ డిజిటైజేషన్ మూడో దశలో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని దాదాపు 110 నుంచి 115 పట్టణాలు, నగరాల్లో కేబుల్ టీవి సంస్థలు సెట్టాప్ బాక్సులను అమర్చుకోవాల్సి ఉంది.
కేబుల్ డిజిటలైజేషన్ మూడో దశ కింద దేశవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జనవరి 1 నుంచి అనలాగ్ ప్రసారాలు నిలిపివేయాల్సి ఉంది. డిజిటల్ అడ్రెసబుల్ సిస్టమ్ (డాక్) అమలుకు డిసెంబరు 31వరకు ట్రాయ్ గడువు విధించిన సంగతి తెలిసిందే. డిజిటలైజేషన్ కోసం మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్ఓ), స్థానిక కేబుల్ ఆపరేటర్లకు అధికారులు సూచనలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, నగరాలలో దాదాపు 45 నుంచి 50 లక్షల టీవీలకు సెట్టాప్ బాక్సులు అమర్చాల్సి ఉంది. ఇప్పటివరకు సగం మేర అమర్చుకుని ఉంటారని కేబుల్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఇందులో కేబుల్ సంస్థల వాటాయే అధికమని, డీటీహెచ్ సంస్థలు 15 శాతం వరకు అమర్చి ఉంటాయని అంటున్నారు. సెట్టాప్ బాక్సులు ఉంటేనే టీవీ ప్రసారాలు వస్తాయంటూ గత నాలుగు నెలలుగా విస్తృతంగా టీవీల్లో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే గడువులను ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ పోతున్నందున, తొందరేముందిలే అని భావించిన వారు మాత్రం సెట్టాప్ బాక్సులు అమర్చుకోలేదు. అయితే ఈసారి గడువు పెంచేందుకు నిరాకరిస్తూ, బాంబే హైకోర్టు తాజాగా తీర్పు ఇవ్వడంతో, ఈసారి అనలాగ్ ప్రసారాల నిలిపివేత దిశగా చర్యలు ఉంటాయని అందరూ భావించారు. అయితే బుధవారం హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరో రెండు నెలల పాటు సెట్టాప్ బాక్సు లేకున్నా టీవి ప్రసారాలు కానున్నాయి.