ఆంధ్రా పాలకుల దళారీ కేసీఆర్.!ప్రగతిభవన్ లో గుత్తేదారులకే ప్రవేశం.!జూన్ 2న కోదండరాం ఆత్మగౌరవ దీక్ష.!
హైదరాబాద్ : ప్రొఫెసర్ కోదండరాం సర్ కు మళ్లీ కోపం వచ్చింది. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా తెలంగాణ కల మాత్రం సాకారం కాలేదంటున్నారు కోదండరాం. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్ తో తెచ్చుకున్న తెలంగాణలో ఆశించిన అభివృద్ది జరగలేదని, సీఎం చంద్రశేఖర్ రావు కూడా ఆ దిశగా ప్రణాళికలు రూపొందించడం లేదని కోదండరాం ఘాటుగా విమర్శిస్తున్నారు. స్వరాష్ట్రంలో చంద్రశేఖర్ రావు విధానాలకు ప్రజలు విసిగిపోయారని కోదండరాం ఆరోపించారు. చంద్రశేఖర్ రావు తీరుకు నిరసనగా జూన్ రెండు తెలంగాణ ఆవిర్బావం రోజున ఆత్మగౌరవ దీక్ష చేయబోతున్నట్టు కోదండరాం ప్రకటించారు.

జూన్ రెండున కోదండరాం ఆత్మ గౌరవ దీక్ష.. కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించిన ఆచార్య
తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో చంద్రశేఖర్ రావుతో పాటు కీలక పాత్ర పోషించిన సిసలైన ఉద్యమ కారుడు ప్రొఫెసర్ కోదండ రాం. చంద్రశేఖర్ రావు తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న వ్యక్తి కోదండరాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోదండరామ్ రాజకీయంగా చాలా వెనకబడిపోయారు. అందుకు తగ్గట్టే సీఎం చంద్రశేఖర్ రావు కూడా కోదండరాం కు ప్రాధాన్యత ఇవ్వడం పూర్తిగా తగ్గించేసారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కోదండరాం భవిత అగమ్యగోచరంగా మారింది. జనసమితి అనే రాజకీయ పార్టీని స్ధాపించి ప్రజలలోకి వెళ్లేందుకు కోదండరాం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఇది ఆత్మ గౌరవం కోసం మరో పోరాటం.. ఉద్యమకారులు ఏకం కావాలన్న కోదండరాం
ఇదిలా ఉండగా కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి అంతగా ప్రజాధరణ పొందలేకపోతున్నప్పటికి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై కోదండరాం పోరాటం చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా ఎన్నో ఎన్నికల్లో అదృష్టాన్ని కూడా కోదండరాం పరీక్షించుకున్నారు.అంతే కాకుండా కోదండరాం ప్రభుత్వ విధానాలపై, సీఎం చంద్రశేఖర్ రావు ప్రజా వ్యతిరేక విధానాలపై మరోసారి పోరాటానికి సిద్ధం అవుతున్నారు. తెలంగాణ ఆవిర్బావ దినం జాన్ 2న ఆత్మ గౌరవ దీక్ష చేయబోతున్నారు. తెలంగాణ ఉద్యమ కారులను మరోసారి ఏకం చేస్తామని, ఆత్మ గౌరవం కోసం మరో పోరాటం ప్రారంభిస్తామని కోదండరాం స్పష్టం చేసారు.

ప్రగతి భవన్ గుత్తేదారుల అడ్డ.. నిజమైన ఉద్యమకారులకు అక్కడ ప్రవేశం లేదన్న ప్రొఫెసర్
తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమం తీవ్ర స్ధాయిలో జరిగిందని, ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడిందన్నారు కోదండరాం. ఆంధ్రా పాలకుల ఒత్తిడిని తట్టుకొని, ధైర్యంగా నిలబడి పోరాటం చేసారని, కాగా తెలంగాణ రాష్ట్రాన్ని తానే సాధించుకొచ్చినట్టు చంద్రశేఖర్ రావు చరిత్రను వక్రీకరిస్తున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేసారు.

సచివాలయం లేకుండా నియంతృత్వ పాలన.. కేసీఆర్ విధానాలపై పోరాటం ఉదృతం చేస్తామన్న మాస్టారు..
చంద్రశేఖర్ రావు సీఎం పగ్గాలు చేపట్టగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టారని కోదండరాం విమర్శించారు. కనీసం సచివాలయం లేకుండా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక, భూ దందాలు పెరిగిపోయాయని, ప్రభుత్వం తీసుకు వచ్చిన కంపెనీల్లో తెలంగాణ బిడ్డలకు ఎంత మందికి ఉపాధి కల్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ ప్రవేశం తెలంగాణ ఉద్యమకారుల కంటే ఆంధ్రా గుత్తేదారులకే సునాయాసంగా మారిందన్నారు కోదండరాం. ఏ ఆత్మ గౌరవం కోసం పోరాడమా, ఆ ఆత్మ గౌరవాన్ని ఆంధ్రా గుత్తేదారుల వద్ద తాకట్టు పెట్టారని, సీఎం ఆంధ్రా పాలకులకు దళారీగా మారిపోయాడని, అందుకే జాన్ 2న ఆత్మ గౌరవ దీక్ష చేస్తామని, ఉద్యమ కారులందరూ ఏకం కావాలని కోదండరాం పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications