బ్యాన్: అసెంబ్లీ వద్ద ఏబీన్ ధర్నా, హామీ
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆ సంస్థ జర్నలిస్టులు బుధవారం నిరసన తెలిపారు. దీనిపై శాసన సభ సభాపతి మధుసూదనాచారి స్పందించారు. మీడియా కమిటీ చైర్మన్ ఈశ్వర్ రెడ్డితో ఆయన సమాచారం పంపించారు.
తెలంగాణలో ఎమ్మెస్వోలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానల్ ప్రసారాలను నిలిపివేసి ఇప్పటికి 144 రోజులు అయిందని, పత్రికలు, ప్రజాసంఘాలు ఇది నిరంకుశమని, ప్రజాస్వామిక గొంతులు ఎలుగెత్తినా, ఎన్ని నిరసనలు వెల్లువెత్తినా ప్రయోజనం లేకపోయిందని జర్నలిస్టులు నిరసన తెలిపారు.
బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సమయంలో ఏబీఎన్ ప్రతినిధులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సంఘీబావం తెలిపారు. ఏబీఎన్, టీవీ 9 టివి చానళ్ల ప్రసారాలను ఇలా అడ్డుకోవడం చాలా అప్రజాస్వామికమన్నారు.
ఇరు సభలు వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం సభ ప్రారంభంకాగానే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సభలో 2014-15 తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే స్పీకర్ మధుసూదనాచారి సభను ఎల్లుండికి వాయిదా వేశారు. శాసనమండలిలో మంత్రి రాజయ్య బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది.
తెలంగాణ శాసన సభ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడిన అనంతరం స్పీకర్ మధుసూదనాచారి ఛాంబరులో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. మండలి చైర్మన్ స్వామిగౌడ్, ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, మజ్లిస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.