హైదరాబాద్ లో తీవ్ర విషాదం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. గచ్చిబౌలిలోని అంజయ్య నగర్ లో ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శిథిలాలు మీద పడి మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్షతగాత్రులను వెంటనే రెస్క్యూ టీమ్ సమీప ఆస్పత్రికి తరలించింది. నాలాను ఆనుకుని ఉన్న కేవలం 50 గజాల విస్తీర్ణంలోనే ఏడంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో దానికి ఆనుకుని ఉన్న హాస్టల్ లోని వాళ్లు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో దాని పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ అపార్ట్ మెంట్ పాక్షికంగా దెబ్బతింది. శిథిలాలు మీదపడి అపార్ట్ మెంట్ గోడలు ధ్వంసం అయ్యాయి. ఫ్లాట్లలోని సామాగ్రి ధ్వంసం అయింది. భవనం కుప్పకూలడంతో అపార్ట్ మెంట్ వాసులు సైతం భయంతో పరుగులు తీశారు. తమ సామాగ్రి ధ్వంసం కావడంపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నిర్మాణంలో ఉన్న భవనం శిథిలాల కింది మరో ముగ్గురు కార్మికులు చిక్కుకుని ఉండొచ్చని డీఆర్ఎఫ్ సిబ్బంది అంచనా వేస్తోంది. దాంతో శిథిలాలు తొలగించి ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇక యజమాని అత్యాశతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం 50 గజాల స్థలంలో ఏడు అంతస్తుల భవనం నిర్మాణం ఏంటని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి నిర్మాణాలపై జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు పట్టించుకోవడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే అంజయ్య నగర్ లో చాలా బిల్డింగ్ ల పరిస్థితి ఇలాగే ఉందని.. పర్మిషన్ లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. 50 గజాలలో ఏడు అంతస్థులు ఎలా నిర్మిస్తున్నారు..? ఇది నిజమేనా.. మరి కొందరు కామెంట్స్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications