ఉస్మానియాలో మరో గర్భిణి మృతి: నాసిరకం మందుల వల్లేనా?
ఉస్మానియా ఆసుపత్రిలో మంగళవారం నాడు ఓ మహిళ మృతి చెందారు. మల్కాజిగిరికి చెందిన 22 ఏళ్ల మహిళ రజిత ఇటీవలే బేబీని ప్రసవించింది.
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో మంగళవారం నాడు ఓ మహిళ మృతి చెందారు. మల్కాజిగిరికి చెందిన 22 ఏళ్ల మహిళ రజిత ఇటీవలే బేబీని ప్రసవించింది.
ఇటీవల బాలింతల మరణాలు జరగడంతో సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే నిండు గర్భిణీలను, అప్పటికే పురుడు పోసుకున్న బాలింతలను నిలోఫర్కు పంపించారు.
నాలుగు రోజుల క్రితం సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో శస్త్రచికిత్స ద్వారా కాన్పు అయిన రజిత (24)ను నిలోఫర్కు తీసుకెళ్లారు. ఆమె కోలుకుంటుందని భావించిన సమయంలో పరిస్థితి విషమించింది.
వెంటనే ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం పరిస్థితి విషమించి ఆమె కన్నుమూసింది. ఆమెకు నాసిరకం సెలైన్ ఎక్కించడం, మందుల వల్లే చనిపోయిందని ఆరోపిస్తున్నారు.
దీంతో ఈ ఆసుపత్రుల్లో మృతుల సంఖ్య 12కు చేరింది. రజిత బంధువు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆమెను ఆసుపత్రిలో చేర్పించాక సాయంత్రం ఊపిరి తీర్చుకోవడానికే ఇబ్బంది పడిందని ఆయన చెప్పారు. రజితను విషమ పరిస్థితుల్లో ఆసుపత్రికి తీసుకు వచ్చారని డాక్టర్లు చెబుతున్నారు.