టీటీడీపీ భేటీకి బాబు డుమ్మా: ఆంధ్రా నేతలపై రేవంత్ గుర్రు
హైదరాబాద్: అనంతపురం జిల్లా వెంకటాపురంలో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చిచ్చుపెట్టిందా ? ఇద్దరు స్నేహితుల మధ్య దూరం పెంచిందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏకంగా పార్టీని వదిలేసి పోతామని అధినేత చంద్రబాబుకే రేవంత్ రెడ్డి వంటి వారు చెప్పేదాకా వచ్చిందా ? వచ్చే జనవరి నాటికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా ? అంటే అవుననే జవాబు వస్తోంది.
ఈ నేపథ్యంలో గురువారం జరిగిన టీటీడీపీ ముఖ్య నేతల సమావేశానికి హాజరవుతారని, సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చిన ఏపీ సీఎం - టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గైర్హాజరు కావడం ఆసక్తి కర పరిణామం. పార్టీ బలోపేతంపై తెలంగాణ టీడీపీ నేతలమధ్య వాడీ, వేడీ చర్చ జరిగింది. టీడీపీ ముఖ్య నేతలంతా హైదరాబాద్కే పరిమితం అవుతున్నారని, జిల్లాల్లో తిరగకుండా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లేకుండా ఎలా బలపడతామని కొందరు నాయకులు ప్రశ్నించినట్టు తెలిసింది.
తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికల్లో అధికారం టీడీపీదే అని పదే పదే ప్రకటనలు చేస్తున్నా, పార్టీని బలోపేతం చేసే దిశలో పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు వచ్చే జనవరి నెల వేదిక కానున్నదనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికలకు రెండే రెండు రాజకీయ పార్టీలు మాత్రమే ఎన్నికలకు వెళతాయని చెబుతున్నవారూ ఉన్నారు.
టీటీడీపీకి చేటు చేసేలా ఏపీ టీడీపీ నేతల వైఖరి
పరిటాల రవి కుమారుడి శ్రీరాం వివాహం కోసం సీఎం కేసీఆర్ ఇటీవల అనంతపురం జిల్లాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్తో ఏకాంతంగా సీఎం కేసీఆర్ భేటీ అయినప్పుడు నంద్యాల లోక్సభ ఉప ఎన్నిక, ఏపీ రాజకీయాల గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారని అంతా అనుకున్నారు. కాగా అక్కడ అంతేకంటే ఎక్కువే జరిగినట్టు తెలంగాణ నేతలు గుర్తించారు. అది తమకు చేటు చేసేదిగా ఉందని ఆగ్రహం, ఆందోళనతో ఉన్నారు. ఈ పరిణామాలు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎ రేవంత్రెడ్డికి, ఆయన వర్గీయులకు మింగుడుపడటం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్పై తాను చేస్తున్న పోరాటం ఈ పరిస్థితులతో నీరుగారిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
పయ్యావుల వైఖరిపై టీటీడీపీలో ఇలా వ్యతిరేకత
తెలంగాణ సీఎం కేసీఆర్ అనంతపురంలో పరిటాల శ్రీరాం వివాహానికి వెళ్లినప్పుడు ఆ మేరకు మాత్రమే వ్యవహరం నడపకుండా, తెలంగాణ పార్టీ విషయాలు చర్చించడం పట్ల రేవంత్ ఇటీవల చంద్రబాబుతో జరిగిన భేటీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రా పార్టీ నేతల వైఖరి తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తుందని, ఇది ఎంతమాత్రం సరికాదని కుండబద్దలు కొట్టారు. ఈ విషయం రేవంత్, కేశవ్ మధ్య అభిప్రాయ బేధాలకు కారణమైనట్టు సమాచారం. ఏండ్ల తరబడి అధికారానికి దూరంగా ఉండి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో పయ్యావుల కేశవ్లాంటి నేతలు మొత్తం తెలంగాణ పార్టీకి నష్టం చేసే రీతిలో వ్యవహరించడం పట్ల పార్టీవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
తెలంగాణ రాజకీయాలపై చర్చెందుకన్న రేవంత్
రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్లో ఉన్న వారి ఆస్తులను కాపాడుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్తో సఖ్యతతో ఉండాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని, కానీ ఒక సామాజికవర్గాన్ని, ఆ వర్గం ఓట్లను అధికార టీఆర్ఎస్ వైపు మళ్లీంచే కుట్రను సహించబోమని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ తరుణంలో పయ్యావుల కేశవ్, ఇతర నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడి మందలించారని, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందనే ప్రచారం సైతం సాగుతున్నది. ఇదిలా ఉండగా తెలంగాణ తెలుగుదేశంలో ప్రస్తుతం అంతర్గత విభేదాలు ఎక్కువ అయ్యాయి. నేతలంతా ఎవరికి వారే యమునాతీరే అనేలా వ్యవహరిస్తున్నారు. ఒకింత ఐక్యత కొరవడింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే వర్గపోరు తీవ్రమైంది. పార్టీ రెండు గ్రూపులు.. రేవంత్, రమణ వర్గాలుగా చీలిందని కూడా ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
రమణ ప్లస్ రేవంత్ వేర్వేరు ప్రతిపాదనలు
వచ్చే ఎన్నికలకు పార్టీని సంసిద్దం చేసే విషయమై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ ఒక రకంగా, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మరొక విధంగా సమాయత్తమవుతున్నారు. వారిద్దరూ వచ్చే ఎన్నికలకు రెండు రకాల ప్రత్యామ్నాయాలను పార్టీ అధినేత చంద్రబాబు ముందు ఉంచినట్టు తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. ఒకటి బీజేపీ సీఎం అభ్యర్థిగా టీడీపీకి 40 అసెంబ్లీ సీట్లు తీసుకుని ఎన్నికలకు పోవడం. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమీత్షా తో ప్రకటింపజేసి, తెలంగాణలో పర్యటించేలా చర్యలు తీసుకోవడం. రెండోది టీడీపీ ఓంటరిగా అన్ని సీట్లకు పోటీచేసేలా సిద్దం కావడం. రమణ వర్గం మాత్రం బీజేపీకి టీఆర్ఎస్ ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చినట్టు సమాచారం.
కుదరదంటే కాంగ్రెస్ లోకి వెళ్లి ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ ప్లాన్?
టీటీడీపీ అధ్యక్షుడు రమణ ప్రతిపాదనలకు రేవంత్ ససేమిరా అన్నట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్తో పోత్తుకు గానీ, అందులో కలిసేదిగాని లేదని అన్నట్టు సమాచారం. ఇవి కుదరకపోతే రేవంత్ వర్గీయులు కాంగ్రెస్లోకి వెళ్లి వామపక్షాలు, ఎంఐఎంతో కలిసి ఎన్నికల బరిలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం జనవరి నుంచే ప్రణాళిక రూపొందించి అమలు చేసేదిశగా పని చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై రేవంత్ రెడ్డి తన తనుచరులతో సంప్రదిస్తున్నట్టు వినికిడి. పొత్తుల సంగతిని ఎన్నికల ముందే చూద్దామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పగా, రేవంత్ మాత్రం ముందే తేల్చాలని పట్టుబడుతున్నారు. ఆలస్యంగా నిర్ణయం చేస్తే ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, వీలుకాదనే భావనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.