చంద్రబాబే మా టార్గెట్...మొగోడు,మొనగాడే అయితే ఐదేళ్లలో అమరావతి ఎందుకు కట్టలేదు:కెటిఆర్
హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీకి ఎపి సిఎం చంద్రబాబు ఆర్థిక సహకారం అందిస్తున్నారని...ఏపీకి చెందిన నిఘా విభాగాన్ని ఇక్కడ దించారని...కేసీఆర్ను అస్థిరపరచాలని, తెలంగాణలోనూ తన పాత్ర ఉందని చెప్పాలని చంద్రబాబు చూస్తున్నారని టిఆర్ఎస్ అగ్రనేత,మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు.
కెటిఆర్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టా గోష్ఠిగా మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతుంటే ఎలా అంగీకరిస్తాం?...అందుకే కాంగ్రెస్ ను సీరియస్ గా తీసుకోకుండా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నామని కేటీఆర్ తేల్చిచెప్పారు. "చంద్రబాబు సైబరాబాద్ కట్టిన మొగోడు...మొనగాడే అయితే ఐదేళ్లలో అమరావతిని ఎందుకు నిర్మించలేకపోయారు?"...అని కెటిఆర్ నిలదీశారు.

తెలంగాణాతో...కెసిఆర్ బంధం
తెలంగాణ ప్రజలతో కేసీఆర్ది భావోద్వేగ బంధమని...ఇది చాలా దృఢమైనదని...దీనిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని కెటీఆర్ అన్నారు. ఎవరినైతే ఒకసారి నమ్ముతారో వారి విషయంలో నమ్మకంగా ఉండటం, నమ్మితే ప్రాణాలు ఇవ్వటం తెలంగాణ ప్రజల స్వభావం. అందుకే వెయ్యి రూపాయల పింఛన్ కళ్ల చూపించిన కేసీఆర్ను నమ్ముతున్నారు. పేదలు ఒకప్పుడు ఇందిరాగాంధీని, ఆ తర్వాత ఎన్టీ రామారావును తమ సొంత మనుషులుగా భావించారు. వాళ్లంతా ఇప్పుడు కేసీఆర్ వైపు మళ్లారని కెటిఆర్ చెప్పుకొచ్చారు.

జీహెచ్ఎంసీలో...చూశాం
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ తిరిగితే ఏమైందో చూశాం. అప్పుడు తాను హైదరాబాద్ లోకల్ అని చెప్పిన లోకేష్ ఆ తర్వాత ఏపీలో మంత్రి అయ్యారు. చంద్రబాబు ఆయనను ఏపీలో మంత్రిని చేసి, తెలంగాణలో టీడీపీ లేదని సంకేతం ఇచ్చారు. టీడీపీ అధినేత ఏపీలో ఉంటే, ఇక్కడ పార్టీ ఎలా ఉంటుంది?...అని కెటిఆర్ నిలదీశారు. గతంలో సీమాంధ్రులు టీఆర్ఎస్ పై కోపంతో ఉండేవారని...జీహెచ్ఎంసీ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ వైపు మళ్లారని కేటీఆర్ తెలిపారు.

రెఫరెండమే...కెటిఆర్ స్పష్టం
కేసీఆర్ ఎన్నికల కోసం కాకుండా పేదలపై సానుకూల దృక్పథంతో పని చేస్తారని అన్ని వర్గాలు భావిస్తున్నారని కెటిఆర్ చెప్పారు. గడిచిన నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు ఈ అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండమ్ అని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటు వేయటం ద్వారా తమ పాలన బాగుందా? లేదా?...అనే విషయాన్ని చెప్పాలని ప్రజలను కెటిఆర్ కోరారు. అలాగే విపక్షాల పనితీరుకు కూడా ఈ ఎన్నికలను రెఫరెండమ్గా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆ తరహా...ఎన్నికలైతే
తాజా మాజీ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందినప్పటికీ వారి విషయంలో ప్రజలు వంద శాతం సంతృప్తి వ్యక్తం చేయటం అసాధ్యమని...ఎవరిపైన అయినా ఎంతో కొంత అసంతృప్తి ఉంటుందని...సామాజిక పనులు చేసినప్పటికీ వ్యక్తిగత పనులు చేయలేదని తప్పుబట్టే వాళ్లు ఉంటారని కెటిఆర్ విశ్లేషించారు. ముఖ్యమంత్రి పదవి కోసం
అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో తెలంగాణాలో ఎన్నికలు జరిగితే కేసీఆర్కు 80 శాతానికి పైగా ఓట్లు పోలవుతాయన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కెసిఆర్ పై 51 శాతానికి పైగా సానుకూలత ఉంది. పార్టీ అభ్యర్థుల గురించి వ్యక్తిగతంగా ఆలోచిస్తున్న వారు కూడా కేసీఆర్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

సిద్ధాంతాలు కాదు...కుట్ర మాత్రమే
కాంగ్రెస్, టీడీపీలను కలుపుతున్నది సిద్ధాంతాలు కాదు. కేసీఆర్ను గద్దె దించాలనే కుట్ర మాత్రమే. మహా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీ పూర్తయ్యేలోపు, మేం ఎన్నికల్లో గెలిచి స్వీట్లు పంచుకుంటాం. ముందు వాళ్ల సీట్లు తేలనీయండి. మహా కూటమికి ముందున్నది ముసళ్ల పండుగ. వాళ్లు అంగీలాగు చింపుకుంటారు చూడండి. అన్ని సర్వేల్లోనూ టీఆర్ఎస్ కి వందకు పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలుతోంది. మహా కూటమి అభ్యర్థులను చూశాక, ఒకవేళ వ్యూహాలను ఏమైనా మార్చుకోవాలా? అనే విషయాన్ని ఆలోచిస్తాం. 90 శాతం ప్రజలు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓటేయాలని నిర్ణయించుకున్నారు.

ఐటి దాడులు...మేమేమైనా అన్నామా?
ప్రధాని నరేంద్ర మోడీని చూసి తెలంగాణలో భయపడే వాళ్లు ఎవరూ లేరు. మోడీని భూతంలా చూపించి, మాపై రుద్దాలని చంద్రబాబు చూస్తున్నారు. మోడీ అంటే చంద్రబాబుకు భయం ఉండవచ్చు. కానీ మాకు లేదు. సీఎం రమేష్, రేవంత్రెడ్డి ఇళ్లలో ఐటీ దాడులు జరిగితే, చంద్రబాబుకు ఉలికిపాటు ఎందుకు? మా దగ్గర కూడా టీఆర్ఎస్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విజయ రామారావు కుటుంబంపై ఐటీ దాడులు జరిగాయి. మేమేమైనా అన్నామా? ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులపై అక్కడి సీఎం చంద్రబాబు మాట్లాడటం, కేబినెట్లో చర్చించటం ఆశ్చర్యం కలిగిస్తోందని కెటిఆర్ వ్యాఖ్యానించారు.అమిత్షా విమర్శలు పాత చింతకాయ పచ్చడి లాగే ఉంటున్నాయని...మతం ఆధారంగా రాజకీయాలు చేసే బీజేపీని తెలంగాణ ప్రజలు ఎప్పటికి ఆమోదించరని కెటిఆర్ తేల్చేశారు.












Click it and Unblock the Notifications