హైద్రాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లాల్సిందే: హరీష్, గుంటూరు కేంద్రం వినియోగిస్తాం: కవిత
హైదరాబాద్: భాగ్యనగరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎప్పటికైనా హైదరాబాదును ఖాళీ చేయాల్సిందేనని మంత్రి హరీష్ రావు గురువారం అన్నారు. ఇక్కడ వారు ఎప్పటికైనా కిరాయిదారులే అన్నారు. వారు ఇప్పుడైనా, మరికొద్ది రోజులకైనా వెళ్లిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయలేని చంద్రబాబు అసమర్థతపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం పెరిగాయన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబును చూసి ఆంధ్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.
ఏడాది దాటినా ఏమీ చేయలేని చేతగాని చంద్రబాబుపై ఆంధ్ర జనం ఆశలు వదులుకున్నారని, ఈ పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకే పాలమూరు, డిండి ఎత్తిపోతలపై టీడీపీ లేఖల డ్రామాలు ఆడుతున్నదన్నారు.
పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయండి: కవిత
తెలంగాణలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం కేంద్రాన్ని కోరారు. లోకసభ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ పసుపు పంట సాగుపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పసుపు ఉత్పత్తిలో తెలంగాణది అగ్రస్థానం. సరైన మార్కెట్, మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పసుపు రైతులకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని, పసుపు సాగు పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.
ఏపీలోని గుంటూరులో ఉన్న పసుపు కేంద్రాన్ని వినియోగించుకునేలా తెలంగాణ రైతులకు అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పసుపు పంటలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు.