కువైట్ జైల్లో కడప వాసి ఆత్మహత్య, జర్మనీలో రోడ్డు ప్రమాదంలో నాగర్ కర్నూల్ వాసి మృతి
హైదరాబాద్: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు తెలుగు వ్యక్తులు వేర్వేరు దేశాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఒకరు జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరొకరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ రెండు ఘటనలతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. కువైట్ సెంట్రల్ జైలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా వాసి వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కువైట్ లోని ఆర్డియా ప్రాంతంలో ముగ్గురిని హత్య చేసిన కేసులో ఆయనపై ఆరోపణలున్నాయి.. ఈ నేపథ్యంలో కువైట్ పోలీసులు వెంకటేశ్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి స్వస్థలం కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు. వెంకటేశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడనే విషయం తెలిసిన ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
జర్మనీలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణవాసి దుర్మరణం
జర్మనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా అమర్ సింగ్(27) మృతి చెందారు. ఈ ప్రమాదం ఆదివారం జరిగింది. కాగా, బుధవారం రాత్రి అమర్ కుటుంబసభ్యులకు అధికారులు సమాచారమిచ్చారు. అచ్చంపేట మండలం అక్కారానికి చెందిన అమర్ సింగ్.. ఉన్నత చదువుల కోసం కొంతకాలం క్రితం జర్మనీ వెళ్లాడు. ప్రస్తుతం అతడు ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
కాగా, మార్చి 13న స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అమర్ సింగ్ మరణించాడు. కాగా, అమర్ సింగ్ కుటుంబసభ్యులకు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించారు. అమర్ సింగ్ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించాలని మంత్రి కేటీఆర్ను ఆయన కోరారు.