ఆ స్మశానవాటికలో వ్యభిచారం, అసాంఘిక కార్యాకలాపాలు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీరియస్!
పవిత్రమైన శ్మశానవాటికలను కూడా కొందరు వదలటం లేదు. సమాజంలోని కొందరు అసాంఘిక మూకలు స్మశానలాను దుర్వినియోగం చేస్తున్న విషయం తాజాగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రకాష్ నగర్ డివిజన్లో భాగంగా ధనియాలగుట్ట శ్మశానవాటికను సందర్శించి, స్థానికుల సమస్యలను సీరియస్గా పరిశీలించారు.
అక్రమ కార్యాకలాపాలకు అడ్డాగా స్మశానవాటిక.. ఎమ్మెల్యే ఆగ్రహం
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఈ శ్మశానవాటిక, ప్రస్తుత పాలకుల, అధికారుల నిర్లక్ష్యం వల్ల రాత్రి పగలు వ్యభిచారం, మద్యపానం వంటి అక్రమ కార్యకలాపాలకు కేంద్రంగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే పర్యటన సమయంలో స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం
పగటి పూట కూడా భయంగా ఉంటుంది. శ్మశానవాటిక చుట్టుపక్కల తిరగడానికే భయమేస్తోంది అని స్థానికులు చెప్తున్నారని ఆయన తెలిపారు. భద్రతా సిబ్బంది లేకపోవడం, కనీస నిర్వహణ లోపాలు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి పవిత్ర స్థలాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని నొక్కి చెప్పిన ఎమ్మెల్యే, స్థలం నుంచే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి తీవ్రంగా మండిపడ్డారు.
కఠిన చర్యలకు ఆదేశం
భద్రతా చర్యలను పటిష్ఠం చేయడం, నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయడం, అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మరిన్ని సమస్యలను కూడా ప్రస్తావించారు. బేగంపేట డివిజన్ను మల్కాజిగిరి నియోజకవర్గంలోకి విలీనం చేయడం వల్ల స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం కూడా కష్టంగా మారిందని అన్నారు.
పరిపాలనా మార్పులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ఇలాంటి పరిపాలనా మార్పులు ప్రజల జీవనవిధానాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే శ్యామలాల్ బిల్డింగ్ ప్రాంతంలోని బస్తీ దవాఖానాను కూడా సందర్శించారు. అక్కడ వైద్యసేవలు, మందులలభ్యత, రోగుల సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకుని, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. తర్వాత ప్రకాష్ నగర్లో నిర్వహించిన సమావేశంలో ప్రజలు రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. వీటన్నింటినీ త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications