తెలంగాణలో 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు: బీసీ బంధు నిలిపివేత
హైదరాబాద్: రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో నియమించిన కార్పొరేషన్ ఛైర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇక, కార్పొరేషన్ చైర్మన్లలో ప్రధానమైన ఆర్టీసీ ఛైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, రైతు బంధు సమితి ఛైర్మన్ తాటికొండ రాజయ్య, సివిల్ కార్పొరేషన్ ఛైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్, రెడ్కో ఛైర్మన్ సతీశ్ రెడ్డి, తదితరుల 54 కార్పొరేషన్ ఛైర్మన్ నియామకాలను రద్దు చేశారు.

తెలంగాణలో బీసీ బంధు తాత్కాలిక నిలిపివేత
బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దాని అమలుపై సమీక్ష నిర్వహించాల్సి ఉందన్నారు. ఆదివారం గాంధీభవన్లో మీడియా సమావేశం తరువాత మంత్రి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖలపై సమీక్షలు చేయకుండా మాట్లాడటం సరియైనది కాదని అభిప్రాయపడ్డారు. సమీక్ష నిర్వహించి వాస్తవాలు తెలుసుకున్న తరువాతనే మీడియా ముందుకు వస్తానని తెలిపారు.
బీసీ బంధు పూర్తి స్థాయిలో పారదర్శకంగా అర్హులకు చేరేట్లు తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఆర్టీసీ పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం కాలేదన్న ఆయన.. ఉద్యోగులకు, ప్రజలకు ప్రయోజనం కలిగేలా తాము చర్యలు తీసుకుంటామని వివరించారు. ఉద్యోగులు మాత్రం ప్రభుత్వంలో చేరుతున్నారన్నారు. రైతు బంధుపై బీఆర్ఎస్ నాయకులు అప్పుడే విమర్శలు చేయడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. తాము అధికారం చేపట్టి రెండు రోజులకే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని, అందుకు నిదర్శనం అధికార పగ్గాలు చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు హామీలు అమలు చేయడమేనని పొన్నం తెలిపారు.












Click it and Unblock the Notifications