సంక్రాంతికి ఊరెళ్తున్నారా? అయితే దొంగతనాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? చెక్ చేసుకోండి!!
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలామంది తమ సొంత ఊళ్లకు పయనమవుతారు. దీంతో చాలా ఇళ్లకు లాక్ పడుతుంది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గణనీయంగా కనిపించే అవకాశం ఉంది. దాదాపుగా 12 లక్షల మంది హైదరాబాద్ నుండి సొంత ఊర్లకు వెళతారని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సమయంలో చాలా కాలనీలు, అపార్టుమెంట్లు నిర్మానుష్యంగా మారుతాయి. అయితే ఇదే దొంగలకు అదునుగా భావించి దొంగతనాలు చేసే అవకాశం ఉందని, దొంగల నుండి కాపాడుకోవడానికి పలు కీలక జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
బంగారం,నగదు విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి
సంక్రాంతి ఊరు వెళుతున్న వారికి రక రకాల జాగ్రత్తలు చెబుతున్నారు పోలీసులు. సంక్రాంతి పండుగకు ఊరెళ్ళి వాళ్ళు దొంగతనాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బంగారాన్ని లాకర్లలో పెట్టుకోవాలని, ఇంట్లో నగదు, నగలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. విలువైన వస్తువులను తమతోపాటు తీసుకెళ్లాలని, ఇంట్లో ఉంచి వెళ్లడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఊళ్లకు వెళ్లే సమయంలో నమ్మకస్తులైన పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే తమకు కాల్ చేయాలని చెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాదు బీరువా తాళాలు తమతోనే తీసుకువెళ్లాలని, బీరువా తాళాలు ఇంట్లో వదిలి పెట్టి వెళ్లడం మంచిది కాదని చెబుతున్నారు.
వాహనాల విషయంలో జాగ్రత్త .. చెయ్యాల్సింది ఇదే
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్తున్న వారు వాహనాలను బయట పార్కింగ్ చేయకూడదని, గేటు లోపల వాహనాలను పెట్టి హ్యాండిల్ లాక్ తోపాటు, వీల్ లాక్ కూడా చేసుకోవాలని చెబుతున్నారు. ఇంట్లో ఒక గదిలో చిన్న లైట్ వేసి ఉంచాలని, అలా ఉంచడం వల్ల ఇంట్లో మనుషులు ఉన్నట్టుగా కనిపిస్తుందని సూచిస్తున్నారు. ఇంటి తాళం బయట రోడ్డు మీద కనిపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పనిమనుషులు ఉంటే ప్రతి రోజు ఇంటి ముందు ఉంచి ముగ్గు పెట్టేలా చూసుకోవాలని, వీలైతే రాత్రి సమయాల్లో ఎవరైనా ఇంట్లో పడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.
దొంగలకు తెలిసేలా ఈ పనులు చెయ్యకండి
ఇక ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మరీ మంచిదని సూచిస్తున్నారు. ఊరికి వెళ్ళేవాళ్ళు పాల ప్యాకెట్లు, పేపర్లు వేయకుండా జాగ్రత్త తీసుకోవాలని, ఒకవేళ అలా వేసి వాటిని తీయకుండా ఉంటే కచ్చితంగా ఇంట్లో ఎవరూ లేరనే విషయం దొంగలకు తెలిసిపోతుందని పోలీసులు చెబుతున్నారు. ఇంటి డోర్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవడం సురక్షితమని సూచిస్తున్నారు. ఊరికి వెళ్ళే ముందు కిటికీలు, తలుపులు అన్నీ సరిగ్గా వేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
అనుమానం వస్తే ఈ పని చెయ్యండి.. మీ అప్రమత్తతే మీకు శ్రీరామరక్ష
సమీప పోలీస్ స్టేషన్లో ఊరికి వెళుతున్న విషయాన్ని తెలియజేయాలని, తమ ప్రాంతంలో గస్తీ నిర్వహించేటప్పుడు తమ ఇంటిని గమనించాలని పోలీసులకు విజ్ఞప్తి చేయాలని చెబుతున్నారు. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంతో వ్యవహరిస్తే దొంగతనాలను నియంత్రించటం సులభమవుతుందని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో ఎవరైనా అనుమానంగా, కొత్త వ్యక్తులు కాలనీలలో తిరుగుతున్నట్టు కనిపిస్తే 100 నెంబర్ కు డయల్ చేసి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని సూచిస్తున్నారు. మొత్తంగా మీ అప్రమత్తతే మీకు శ్రీరామరక్ష అని, దొంగతనాలు జరగకుండా కాపాడుతుందని పోలీసులు చెప్తున్నారు.
సంక్రాంతికి ఖాళీ అవుతున్న హైదరాబాద్: బస్సులు, రైళ్ళు రష్; ఎంతమంది వెళ్తున్నారో తెలుసా!!