రామాయంపేట నిందితులను అరెస్ట్ చేయండి.. లేదంటే పీఎస్ ఎదుట ఆందోళన చేస్తా: జగ్గారెడ్డి
రామాయంపేటలో తల్లి కొడుకుల ఆత్మహత్య పెను దుమారం రేపింది. మృతుడు సంతోష్ కుటుంబాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం పరామర్శించారు. వారి కుంటుంబానికి జరిగిన నష్టం ఎవరు పూడ్చలేనిదని అన్నారు. ఆత్మహత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నిందితులపై సెక్షన్ 306తో పాటు 302,307 సెక్షన్లు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్య జరిగి నాలుగు రోజులు అవుతున్న ఎందుకు చర్యలు తీసుకోలేదని జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. నిందితులను అరెస్ట్ చేయకుంటే రేపు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తా అని బెదిరించారు. రాష్ట్రంలో హోమ్ మినిష్టర్ ఎక్కడ ఉన్నాడరు అని అడిగారు? నిందితులకు 6 నెలల వరకు బెయిల్ రాకుండా చూడాలని కోరారు. గతంలో సంతోష్ తనకు జరుగుతున్న అన్యాయం పై ఎంతో మందికి ఫిర్యాదు చేసినా.. ఎవరు అతని పట్టించుకోలేదని చెప్పారు. జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రామాయంపేటకు చెందిన తల్లి పద్మ, ఆమె కొడుకు సంతోష్.. కామారెడ్డిలో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కొందరు టీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు వస్తున్నాయి. తల్లీకొడుకుల ఆత్మహత్యకు కారణమైన ఏడుగురిని అరెస్ట్ చేయాలని వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
పద్మ, సంతోష్లు ఇటీవల కామారెడ్డిలోని లాడ్జ్లో రూమ్ తీసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. తల్లి, కొడుకు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన వీడియోను ఫేస్బుక్లో అప్ లోడ్ చేశారని డీఎస్పీ వెల్లడించారు. పోలీసులు సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానిక ఏడుగురు కారణమని మృతులు సూసైడ్ నోటులో పేర్కొన్నారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేధింపులే కారణమని ఆరోపించారు. వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాలని బెదిరింపులకు గురిచేశారని సంతోష్ వీడియోలో చెప్పారు.