Asaduddin Owaisi: జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు జోక్యం
హైదరాబాద్: గ్యాంగ్స్టర్, లోక్సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్ను దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ కూడా మరణించారు. ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి వారిద్దరిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్ అక్కడికక్కడే మరణించారు. ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియలు ముగిసిన వేళ- అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్పై కాల్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనతో ప్రయాగ్ రాజ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిద్దరినీ మెడికల్ చెకప్ కోసం ఆసుపత్రికి తరలిస్తోన్న సమయంలో బైక్పై వచ్చిన ముగ్గురు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ ఘటనపై అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. పోలీసులు, మీడియా సమక్షంలో ఓ ఆసుపత్రి ఆవరణలో అతిక్ అహ్మద్, అతని సోదరుడిని కాల్చి చంపడం- ఉత్తర ప్రదేశ్లో జంగిల్రాజ్ నడస్తోందనడానికి సాక్ష్యమని అన్నారు. శాంతిభద్రతలను కాపాడలేని యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అతిక్ అహ్మద్-అష్రాఫ్ అహ్మద్ జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించడానికి అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్దుష్ట కాల పరిధిలో తన నివేదికను అందజేసేలా ఈ కమిటీని రూపొందించాలని, దోషులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం విధి నిర్వహణలో ఉన్న ఉత్తర ప్రదేశ్ పోలీస్ ఉన్నతాధికారులకు ఉద్వాసన పలకాలని అన్నారు. హంతకులకు ఆయుధాలు ఎలా వచ్చాయనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, పోలీసుల సమక్షంలో కాల్పులు జరిపిన వారిని ఉగ్రవాదులుగా ప్రకటించాలని చెప్పారు. వారిని దేశభక్తులుగా చిత్రీకరించడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఈ జంట హత్యలను కోల్డ్ బ్లడెడ్ మర్డర్గా అభివర్ణించారు ఒవైసీ.












Click it and Unblock the Notifications