పార్టీలు తప్పులు దాచి., ఈవీఎంలపై..: యూపీ ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వందకుపైగా సీట్లలో పోటీ చేసిన ఏఐఎంఐఎం పార్టీకి ఈసారి ఎన్నికల్లో నిరాశే ఎదురైంది. గురువారం ఎన్నికల విడుదలైన ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రజల తీర్పును గౌరవిస్తానని ఆయన అన్నారు. ఇతర పార్టీల మాదిరిగా ఈవీఎంల మీద నెపం నెట్టే ప్రయత్నం చేయనని అన్నారు.
ఈవీఎంలను బాధ్యలను చేయడం సరికాదు: ఒవైసీ
ఇతర పార్టీలు తమ తప్పులను దాచిపెట్టి.. తమ ఓటిమికి ఈవీఎంలను బాధ్యులను చేస్తున్నాయని ఒవైసీ మండిపడ్డారు. యూపీలో 80 20 పనిచేసిందన్నారు. ప్రజల మైండ్ సెట్ మారాలని అన్నారు. యూపీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ తమ పార్టీ తరపున అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, యూపీలో ప్రధానంగా బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య జరిగింది.
ప్రజా తీర్పును గౌరవిస్తామన్నా అసదుద్దీన్ ఒవైసీ
రాజేంద్రనగర్ శాస్త్రిపురంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అసదుద్దీన్ ఒవైసీ.... ఉత్తరప్రదేశ్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఇచ్చిన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు. ఎక్కడ ఏం జరిగింది ఎలాంటి లోటు పాట్లు జరిగాయి.. ఓటములకు గల కారణాలపై పరిశీలన చేసుకుంటున్నామన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ శాతం అధికారికంగా వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో స్పందిస్తానని తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థులకు కేవలం 0.43 శాతం ఓట్లు మాత్రమే సాధించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
కేసీఆర్పై ఒవైసీ ప్రశంసలు
ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ను మొండి మనిషి అంటూ ఎంపీ అసదుద్దీన్ ప్రశంసించారు. కేసీఆర్ గతంలో కంటే యాక్టివ్ అయ్యారన్న ఆయన.. అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్ యాక్టివ్గానే ఉండాలన్నారు. ఇక, దేశంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను మించిన నాయకుడు మనకు లేరన్నారు అసదుద్దీన్ ఒవైసీ.
బీజేపీకి ఒవైసీ కౌంటర్, ముందస్తుపై ఇలా
దేశ రాజకీయాలపై కేసీఆర్ పిలుపు కోసం వేచి చూస్తున్నాని తెలిపారు. కేసీఆర్ను తక్కువ అంచనా వేయవద్దన్న ఆయన.. దేశంలోనూ రాష్ట్రంలోనూ కేసీఆర్ రాజకీయాలలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు.. రాజకీయాలను కేసీఆర్ చాలా ముందుకు తీసుకెళ్తున్నారని వెల్లడించారు. మరోవైపు, బుల్డోజర్ సింబల్ తెలంగాణలో ఎట్టిపరిస్థితిలో నడవదంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఇక, తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదన్నారు ఒవైసీ.