అరాచకాలు, ఫ్యామిలీకి దోచిపెడుతున్నారు: కేసీఆర్పై అసోం సీఎం హిమంత బిశ్వవర్మ ఫైర్
వరంగల్: తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో హనుమకొండలో ఏర్పాటు చేసిన నిరసన సభలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిమంత బిశ్వర్మ మాట్లాడారు.
కొడుకును సీఎం చేసేందుకే కేసీఆర్: హిమంత బిశ్వశర్మ
ప్రధాని మోడీ దేశానికి దారి చూపారన్నారు బిశ్వశర్మ. ప్రజాబలం ముందు ధన బలం పనిచేయదన్నారు. ఈటల రాజేందర్ను ఓడించడానికి రూ.500 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. ఈటల గెలుపుతో కేసీఆర్ మైండ్ పనిచేయడం లేదన్నారు. కేసీఆర్ ను చూసి ఏదైనా నేర్చుకుందామని.., వచ్చా కానీ నేర్చుకోవడనాకి ఇక్కడ ఏం లేదన్నారు. యువకులు, ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారని, పోలీసులు మాత్రమే సపోర్ట్గా ఉన్నారన్నారు. 317 జీవో ఎమోషన్ అర్థం అయ్యిందన్నారు. కొడుకును సీఎం చేయడంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారన్నారు. దేశం మారిందని.. కేసీఆర్ నాటకాలు సాగవన్నారు.
తెలంగాణ వ్యతిరేకులతో కేసీఆర్ విందు రాజకీయాలు: హిమంత
2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమన్నారు హిమంత బిశ్వశర్మ. అస్సాంలో తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కానీ, కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేదన్నారు. కేసీఆర్ కుటుంబానికి దోచి పెడుతున్నారన్నారని ఆరోపించారు. కేసీఆర్ అరాచకాలు పెరిగాయని విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించిన సీపీఐ, సీపీఎంలకు కేసీఆర్ దావత్ ఇచ్చారన్నారు. తెలంగాణ ఆదాయం 9లక్షల కోట్లు, అస్సాం ఆదాయం 3లక్షల కోట్లు అని చెప్పారు. పోలీసుల సపోర్ట్ తో కేసీఆర్ ఎన్ని రోజులు పాలిస్తారని ప్రశ్నించారు.
తెలంగాణకు కేసీఆర్ పాలన అరిష్టం: ఈటల ఫైర్
బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టంగా మారిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పరిస్థితి ఆరిపోయే దీపంలా మారిందని అన్నారు. 2023 వరకు కేసీఆర్ సర్కారు ఉండకపోవచ్చని, మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. టీఆర్ఎస్ సర్కారుకు ప్రజలు ఘోరీ కట్టడం ఖాయమని అన్నారు. టీఆర్ఎస్కు హుజూరాబాద్లో ఎదురైన పరిస్థితి తెలంగాణ అంతటా పునరావృతమవుతుందని ఈటల జోస్యం చెప్పారు. రాజకీయ నాయకులతో పాటు మీడియాపై కేసీఆర్ జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎంత అణిచివేయాలని ప్రయత్నిస్తే అంతగా నిరసనలు ఎగిసిపడతాయని హెచ్చరించారు ఈటల రాజేందర్.
.himantabiswa Ji, your remarks today once again restated the intent of BJP to erase the glorious history of Telangana. I wonder, why you & your party are so threatened with idea of unity? Did you forget the verdict of Telangana in 2018, where BJP lost deposits on 107 seats.
— Kavitha Kalvakuntla (RaoKavitha) January 9, 2022
బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మకు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ గొప్ప సంస్కృతిని తుడిచిపెట్టడానికి బీజేపీ ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం అవడం లేదని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో ఇలాగే విర్రవీగుతూ మాట్లాడిన మీ పార్టీ నేతలకు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి, 107 స్థానాల్లో డిపాజిట్ లేకుండా చేశారు. కేవలం ఒక్క స్థానానికే పరిమితం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇప్పటికీ ఎనిమిది ఏళ్ళు కావస్తోంది మీరు సృష్టించిన 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ?? సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ ప్రకారం, భారత్లో నిరుద్యోగిత రేటు డిసెంబర్లో దాదాపు 8 శాతానికి పెరిగింది. బంగ్లాదేశ్ (5.3శాతం), మెక్సికో (4.7 శాతం), వియత్నాం (2.3శాతం) లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల కంటే కూడా భారత్లో ఈ నిరుద్యోగం రేటు అధికంగా ఉంది. సీఎం కేసీఆర్ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టుకుంటూ , తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రము దానికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మరోసారి తెలంగాణ కు వచ్చినప్పుడు సరైన హోం వర్క్ చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నా అంటూ కవిత కౌంటర్ ఇచ్చారు.