అందరి కళ్లు బాలాపూర్ లడ్డు మీదే!, వేలం పోటీకి 15మంది.. ఎవరికి దక్కేనో?
కొలన్ మోహన్ రెడ్డి కుటుంబం 8సార్లు లడ్డూను దక్కించుకోవడం విశేషం.
హైదరాబాద్: లడ్డు వేలం పాట అనగానే అందరికీ గుర్తొచ్చేది బాలాపూర్ గణేశ్. ఏళ్లుగా ఇక్కడి లడ్డూకి అత్యధిక ధర పలుకుతుండటం ప్రతీ ఏటా వేలం పాటపై ఆసక్తిని పెంచుతూనే ఉంది. గణేశ్ నవరాత్రులు ముగియడంతో తాజాగా బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది.
శోభాయాత్ర తర్వాత లడ్డూ వేలం కొనసాగుతుంది. గతేడాది బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయిలో14.5 లక్షల రూపాయలకు అమ్ముడైన సంగతి తెలిసిందే. స్కైలాబ్ రెడ్డి దీనిని సొంతం చేసుకున్నారు. వేలంలో ఈ లడ్డూను దక్కించుకుంటే కుటుంబానికి సిరి సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
వేలం పోటీకి 15మంది?:
ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం వేలం పాటకు కూడా భారీ ఎత్తున జనం తరలిరానున్నారు. ఈ సారి వేలంలో 15మంది పోటీ పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో లడ్డూ ఎవరికీ దక్కుతుందోనన్న ఆసక్తి అందరిలోను మొదలైంది. 1994లో రూ.450తో బాలాపూర్ లడ్డూ వేలం పాట మొదలైందని గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఆ సంవత్సరం కొలన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి లడ్డును దక్కించుకున్నారు.
కొలన్ బ్రదర్సే టాప్:
బాలాపూర్ లడ్డు 2002 లో తొలిసారి లక్ష మార్క్ ను దాటింది. 2015లొ తీవ్ర పోటీ మధ్య కల్లెం మదన మెహన్ రెడ్డి రూ.10 లక్షల 32వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
బాలాపూర్ లడ్డూని ఇప్పటివరకు బాలాపూర్ గ్రామస్తులే ఎక్కువగా దక్కించుకున్నారు. అందులో కొలన్ మోహన్ రెడ్డి కుటుంబీకులే ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. ఇప్పటివరకు 19సార్లు వేలంపాట జరగ్గా ఎనిమిది సార్లు కొలన్ బ్రదర్స్ లడ్డూని దక్కించుకున్నారు.
ప్రతి ఏటా నిమజ్జనం రోజున ఉదయం 9 గం.కు రూ.1,116లతో వేలం పాట మొదలవుతుంది. వేలం ద్వారా వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారు.
ఖైరాతాబాద్ గణేశ్:
పదకొండు రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ శ్రీ చండీకుమార అంతనపద్మనాభ మహాగణపతి గంగమ్మ తల్లి ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం ఉదయం భాజాభజంత్రీల మధ్య ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది.
ప్రత్యేకంగా క్రేన్:
వెల్డింగ్ పనులు పూర్తి అయిన వెంటనే ఉదయం స్వామికి పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఖైరతాబాద్ నుంచి మొదలైన ఈ శోభాయాత్ర తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ సహాయంతో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు.