దారుణం... లొంగకపోవడంతో హత్య.. ఆటో ఎక్కిన మహిళపై డ్రైవర్ కిరాతకం...
హైదరాబాద్లో దారుణం జరిగింది. పాతబస్తీకి చెందిన ఓ మహిళను ఓ ఆటో డ్రైవర్ దారుణంగా హతమార్చాడు. ఆటోలో ఎక్కిన మహిళను ఆమె చెప్పిన వైపు తీసుకెళ్లకుండా దారి మళ్లించాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో తలలో స్కూడ్రైవర్తో పొడిచి, బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం సమీపంలోని చెరువులో రక్తపు మరకలను కడుక్కొని అక్కడినుంచి పరారయ్యాడు.
రాత్రి 10.15గంటలకు...
పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట మహమ్మద్ నగర్కి చెందిన నసీం ఫాతిమా(30) భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. అప్పటినుంచి స్థానిక ఇళ్లల్లో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఈ నెల 6న ఆమె బాబా నగర్లోని తన సోదరి ఇంటికి వెళ్లింది. రాత్రి 10.15గం. సమయంలో ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో ఓ ఆటోను ఆపి చాంద్రాయణగుట్ట రావాలని కోరింది. సరేనన్న డ్రైవర్ ఆమె ఎక్కించుకుని బయలుదేరాడు.
అత్యాచారయత్నం... హత్య...
కానీ కొద్ది దూరం వెళ్లాక అతను ఆటోను దారి మళ్లించాడు.ఎక్కడికి తీసుకెళ్తున్నావని ఫాతిమా ప్రశ్నించగా.. మద్యం మత్తులో ఉన్న అతను సమాధానమివ్వలేదు. చివరకు జల్పల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఫాతిమా ప్రతిఘటించడంతో తలలో స్కూడ్రైవర్తో గుచ్చి,బండరాయితో మోది హత్య చేశాడు.అనంతరం సమీపంలోని చెరువులో దుస్తులకు అంటిన రక్తపు మరకలను కడుక్కుని అక్కడినుంచి పారిపోయాడు.
Recommended Video
చిక్కిన నిందితుడు...
ఈ నెల 7న జల్పల్లి పెద్ద చెరువు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మహిళ ముఖం గుర్తుపట్టరాకుండా ఉండటంతో ఆమె ఎవరన్నది తేల్చలేకపోయారు. అయితే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అనుమానాస్పదంగా వెళ్లిన ఓ ఆటోను గుర్తించారు. ఆటో నంబర్ ఆధారంగా కంచన్బాగ్కి చెందిన మహమ్మద్ ఫిరోజ్(22) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో తానే మద్యం మత్తులో ఫాతిమా అనే మహిళను హత్య చేసినట్లు ఫిరోజ్ అంగీకరించాడు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.