ఈడీ ముందుకు భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్- ఆ మనీలాండరింగ్ కేసులో విచారణ..!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ, హైదరాబాద్ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు కూడా అయిన మహ్మద్ అజారుద్దీన్ ఇవాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాల వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం ఆయన హైదరాబాద్ లో ఉన్న ఈడీ ఆఫీసుకు వచ్చారు.
హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఉప్పల్ స్టేడియంలో రూ.20 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఉప్పల్ స్టేడియంలో జనరేటర్లు, పైరింజన్ల కొనుగోలు విషయంలో అజార్ మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. దీనిపై ఆయన వివరణ తీసుకునేందుకు ఇవాళ ఆఫీసుకు రప్పించింది. గతంలో పలుమార్లు సమన్లు ఇచ్చినా ఆయన సమయం కోరడంతో తాజాగా సమన్లు ఇచ్చి పిలిపించింది.

ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అనంతరం బయటికి వచ్చిన అజార్.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పేనన్నారు. వీటిపై న్యాయపరంగా పోరాటం చేస్తానని తెలిపారు. ఈడీ విచారణకు పిలిచినందున వచ్చిన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానన్నారు. ఈ కేసులో అజార్ చెప్పిన విషయాల ఆధారంగా ఈడీ తదుపరి తీసుకునే నిర్ణయం ఆధారపడనుంది.












Click it and Unblock the Notifications