ఇనార్బిట్ మాల్లో బీటెక్ స్టూడెంట్స్ చేతివాటం: 2 రాడో వాచీల చోరీ
హైదరాబాద్: వారిద్దరూ బీటెక్ విద్యార్ధులు. మరికొన్ని రోజుల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి భావి ఇంజనీర్లుగా కెరీర్ను ప్రారంభించాల్సి ఉంది. అయితే జల్సాలకు అలవాటు పడ్డ ఆ బీటెక్ విద్యార్ధులు పెడదారి పట్టారు. స్నేహితుల ముందు రిచ్గా కనిపించాలనుకున్నారు.
ఇంట్లో అడిగితే డబ్బు ఇవ్వరని తెలిసి దొంగతనం చేశారు. నగరంలోని ఇనార్బిట్ మాల్లో ఖరీదైన వాచీలను కొనుగోలు చేస్తున్నట్లు నటించి గుట్టు చప్పుడు కాకుండా రూ.1.21 లక్షల ఖరీదు చేసే వాచీలను జేబులో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ సంఘటన ఫిబ్రవరి 9న జరిగింది. ఒక్కో వాచ్ ఖరీదు రూ. 1.21 లక్షలు. దీనిపై షోరూం నిర్వాహకులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సోషల్ మీడియా సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
కూకట్ పల్లికి చెందిన బీటెక్ విద్యార్ధులు ఆర్ సహస్ చౌదరీ, తేజా ఈ దొంగతనం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన రోజు మాల్లో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా... ఇద్దరు కుర్రాళ్లపై అనుమానం వచ్చంది. అయితే వారి ముఖాలు మాత్రం సీసీ పుటేజీలో స్పష్టంగా కనిపించలేదు.
అయితే విద్యార్ధులు మాల్కు వచ్చిన ద్విచక్ర వాహనం నెంబర్ మాత్రం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. దాని ఆధారంగా ఆర్టీఏ కార్యాలయం నుంచి వీరి చిరునామానలను సేకరించారు. అనంతరం ట్విట్టర్, ఫేస్బుక్లో నిందితుల అకౌంట్లు తెరిచి సీసీ కెమెరాలోని దృశ్యాలు, ఫోటోలతో సరిచూసుకున్నారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల దృశ్యాలు, ఫోటోలు సరిపోవడంతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. విచారణలో వారిద్దరూ రాడో వాచీలను దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.