చంద్రబాబును కలిసిన బాబు మోహన్: టీటీడీపీలోకి?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బాబు మోహన్ ఆదివారం ఎన్టీఆర్ భవన్కు వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. దీంతో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు భారతీయ జనతా పార్టీలో కొనసాగిన బాబు మోహన్.. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు. అయితే, ప్రజాశాంతి పార్టీలో చేరినప్పటికీ.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న బాబు మోహన్ తాజాగా, చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, ఎన్టీఆర్ భవన్లో ఆదివారం సాయంత్రం పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని నాయకులను ఆదేశించారు. పనితీరు బాగున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను చంద్రబాబు రద్దు చేయడం గమనార్హం.
తెలంగాణ పార్టీ నేతలతో భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. టీటీడీపీకి చెందిన గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికతో పాటు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆన్లైన్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదుపై సీరియస్గా ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.
అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించిన వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. యువ రక్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించామని, అది మీ అందరి అభిమానంతోనే సాధ్యమైందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో కూడా టీడీపీకి ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications