బండి సంజయ్ ఎపిపోడ్ లో కీలక మలుపు - ఢిల్లీ కేంద్రంగా..!!
తెలంగాణ బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు వ్యవహారం కొద్ది రోజులు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో బండి నాయకత్వ మార్పును ముఖ్య నేతలు వ్యతిరేకిస్తున్నారు. బండి సైతం తాజాగా వరంగల్లో జరిగే ప్రధాని మోదీ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో హాజరౌతానో లేదోనని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బండి సంజయ్ మార్పు వార్తల నేపథ్యంలో ఆయన ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ అధిష్టానం పెద్దలను ఆయన కలవనున్నారు. అధిష్టానం పెద్దల పిలుపుతో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో ఆయన పదవి విషయమై తేల్చేందుకే పార్టీ నాయకత్వం ఆయన్ను పిలిపించిందనే చర్చ సాగుతోంది.

అధ్యక్షుడిగా తన మార్పు ప్రచారంతో బండి సంజయ్ మనస్థాపానికి గురయ్యారు. ఈ నెల 8న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ సమయానికి తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో హాజరౌతానో లేదోనని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కార్యకర్తలు ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి బండి సంజయ్ కు పిలుపు వచ్చింది.
రాష్ట్ర పార్టీ బాధ్యతలను బండి సంజయ్ నుంచి తప్పించి కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటారని.. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో బండి సంజయ్ మనస్థాపానికి గురయ్యారు. ప్రధాని సభ ఏర్పాట్లపై పార్టీ నేతలతో కలిసి పర్యవేక్షించిన బండి సంజయ్ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు.
పార్టీ రాష్ట్ర బాధ్యతల నుంచి తనను తప్పించినా.. అధైర్యపడవద్దని బండి సంజయ్ తనను అభిమానించే కార్యకర్తలు, నాయకులకు బండి నచ్చజెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేస్తున్నారు. బండినే అధ్యక్షుడిగా కొనసాగించాలంటూ కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు. బండిని తప్పిస్తే పార్టీకి మనుగడ ఉండదని కొందరు నేతలు పార్టీ నాయకత్వానికి లేఖలు రాసారు.

ఈ క్రమంలో బండి సంజయ్ ను పార్టీ నాయకత్వం ఢిల్లీ రావాలని ఆదేశించింది. తెలంగాణలో పార్టీ పరిస్థితుల పైన పూర్తి నివేదికతో సిద్దమైన పార్టీ నాయకత్వం బండి సంజయ్ తో చర్చించనుంది. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి కేంద్ర మంత్రిగా ఎందుకు అవకాశం ఇవ్వాల్సి వస్తుంది వివరించే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ వ్యవహారాలను నేరుగా ప్రధాని పర్యవేక్షిస్తున్న వేళ... బండి మార్పుకు ప్రధాని ఆమోదం తెలిపే అవకాశం లేదని బండి మద్దతుగా నిలుస్తున్న నేతలు వాదిస్తున్నారు. తెలంగాణలో రాహుల్ టూర్ తరువాత ఇక పార్టీలో డైలమా ఉండకూడదని పార్టీ నాయకత్వం డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే బండి సంజయ్ ను కొనసాగించటం లేదా మార్చటం పైన నిర్ణయం తేల్చుతూనే...పార్టీకి దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications