బండి సంజయ్ అరెస్ట్: భగ్గుమన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల తదితరులు; బంద్ కు పిలుపు
317 జీవోను సవరించాలంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష రణరంగంగా మారింది. బండి సంజయ్ దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు అనుమతులు లేవని పోలీసులు ఆదివారం రాత్రి బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. మొదట మానకొండూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లిన పోలీసులు బండి సంజయ్ అక్కడ కూడా దీక్ష కొనసాగించడంతో, అక్కడి నుండి మరో చోటికి తరలించారు. కరీంనగర్ పిటిసి గ్రౌండ్ కు తరలించినట్టు చెప్పిన పోలీసులు, ఆ తర్వాత ఆయన ఎక్కడున్నాడు అనేది స్పష్టత ఇవ్వలేదు. దీంతో బీజేపీ నేతలు పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

కెసిఆర్ నిరంకుశ పాలనలో ప్రతిపక్షాలపై అణచివేతలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికమని మండిపడుతున్న బీజేపీ నేతలు సోమవారం నాడు పోలీసుల తీరుకు నిరసనగా కరీంనగర్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసు గేట్లు విరగ్గొట్టి మరీ అరెస్టు చేయడం దారుణమని, అప్రజాస్వామికమని మండిపడ్డారు. కేసీఆర్ నిరంకుశ పాలనలో నిరసనలు, ప్రతిపక్షాల అణిచివేత కొనసాగుతోందని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం అప్రజాస్వామికం: ఈటల రాజేందర్
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బండి సంజయ్ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. బీజేపీ ఆఫీస్ లో కూర్చుని నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం అప్రజాస్వామికమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్, బిజెపి కార్యకర్తలు శాంతియుతంగా ఉద్యోగులకు మద్దతుగా జాగరణ దీక్షకు దిగితే వారిపై విచక్షణారహితంగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం దారుణమని పేర్కొన్నారు.

ప్రజాస్వామికంగా జాగరణ దీక్ష చేస్తుంటే, అరెస్టు చేయడం సిగ్గు చేటు: డీకే అరుణ
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మరియు కార్యకర్తలపై పోలీసుల దాడి ఆప్రజాస్వామికం అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని డీకే అరుణ పేర్కొన్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కార్యాలయం లో 317 జీవో రద్దు కోసం ప్రజాస్వామికంగా జాగరణ దీక్ష చేస్తుంటే, అరెస్ట్ చేయడం సిగ్గు చేటు అంటూ తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు డీకే అరుణ.

ఏ ఒత్తిడి తమ పోరాటాన్ని ఆపలేదు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏ ఒత్తిడి తమ పోరాటాన్ని ఆపలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలందరూ అండగా ఉంటామని ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. అంతే కాదు 317 జీవో ను సవరించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ శాంతియుతంగా చేస్తున్న జాగరణ దీక్షభగ్నం చేయడానికి ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేస్తూ లోపలికి చొరబడి, బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడంహేయమైన చర్య అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసుల చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video

లాఠీఛార్జి చేసినంత మాత్రాన బిజెపి కార్యకర్తలు అదరరు బెదరరు: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తూ జాగరణ దీక్ష చేపట్టిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీ ఛార్జ్ చేసినంత మాత్రాన బీజేపీ కార్యకర్తలు అదరరు,బెదరరు అంటూ తేల్చి చెప్పారు. ఉద్యోగుల పట్ల బీజేపీ పోరాటం ఆగదని సీఎం కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.












Click it and Unblock the Notifications