లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా బండి సంజయ్ ప్రమాణం: కేసీఆర్కు లై డిటెక్టర్ సవాల్
యాదగిరిగుట్ట: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్కు సవాల్ విసిరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నట్లుగానే చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన వ్యవహారంతో తమకు సంబంధం లేదని బీజేపీ మొదటి నుంచి చెబుతోంది.
యాదాద్రిలో బండి సంజయ్ ప్రమాణం
ఈ నేపథ్యంలోనే తమకు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో సంబంధం లేదని యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని.. సీఎం కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన విధంగానే శుక్రవారం మధ్యాహ్నం మునుగోడు నుంచి కార్యకర్తలతో కలిసి యాదాద్రి చేరుకున్న బండి సంజయ్.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తనకు సంబంధం లేదని లక్ష్మీనర్సింహ స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశఆరు. సీఎం కేసీఆర్ కూడా ఇదే విధంగా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్కు బండి సంజయ్ లై డిటెక్టర్ సవాల్
గుండంలో స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలోకి వెళ్లిన సంజయ్.. గర్బగుడి ముందు నిల్చుని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ లీడర్లకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేశారు. సవాల్ ప్రకారం తాను ప్రమాణం చేశానని, ఇంతవరకు కేసీఆర్ ఎందుకు రాలేదని సంజయ్ ప్రశ్నించారు. అంతేగాక, కేసీఆర్ లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? అని బండి సంజయ్ మరో సవాల్ విసిరారు.
బండి సంజయ్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసనలు
బండి సంజయ్ యాదాద్రి పర్యటన నేపథ్యంలో అక్కడ ఉత్కంఠ నెలకొంది. సంజయ్ కు వ్యతిరేకంగా స్థానిక టీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తాను యాదాద్రి వెళ్లి తీరతానని ముందుగానే చెప్పిన సంజయ్ అక్కడికి చేరుకుని ప్రమాణం చేశారు. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామని తెలిసే టీఆర్ఎస్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు.