కేసీఆర్.. దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు రా: బండి సంజయ్ సవాల్
ప్రజా సంగ్రామ పాదయాత్రలో బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. 9వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సిరిపురం నుండి ప్రారంభమైన పాదయాత్రలో రామన్నపేటలో బండి సంజయ్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని బండి సంజయ్ విసిరారు.

నైతిక విలువలుంటే ఉపఎన్నికల్లో కొట్లాడదాం .. రా కేసీఆర్: బండి సంజయ్
కెసిఆర్ కు నైతిక విలువలు ఉంటే ఉప ఎన్నికల్లో కొట్లాడదాము.. రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలంటూ టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేయడంపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఒక్కో లీటర్ పెట్రోలుపై వ్యాట్ పేరుతో రూ.30లు దోచుకుంటున్న టీఆర్ఎస్ నేతలు పెట్రోలు ధరల తగ్గింపుపై ఆందోళన చేయడం సిగ్గు చేటని బండి సంజయ్ మండిపడ్డారు. కర్ణాటకలో తెలంగాణ కంటే 13 రూపాయలు తక్కువగా పెట్రోల్ దొరుకుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులకు కూడా డీజిల్ అక్కడికి వెళ్లి కొట్టించుకుంటే మంచిదంటూ బండి సంజయ్ సెటైర్ వేశారు.

ఆంధ్రా పాలకులతో కుమ్మక్కై కృష్ణా జలాలలో తెలంగాణాకు అన్యాయం
ఆంధ్ర పాలకులతో కుమ్మక్కై 68 శాతం కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్న కృష్ణా జలాల్లో... తెలంగాణ కు హక్కుగా రావాల్సిన 575 టీఎంసీలకు గాను 299 టీఎంసీలు మాత్రమే వచ్చేలా ఒప్పందం చేసుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. కెసిఆర్ తన ఫామ్ హౌస్ నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లకుపైగా ఖర్చు పెట్టారని మండిపడ్డారు. అలాంటిది ఈ ప్రాంత ప్రాజెక్టుల కోసం రూ.700 కోట్లు ఖర్చుపెట్టలేవా? అంటూ బండి సంజయ్ నిలదీశారు.

రాముడి వారసులైతే బీజేపీకి ఓటెయ్యండి
రాముడి వారుసులైతే... బీజేపీకే ఓటేయండి అంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు. పాస్ పోర్టుల బ్రోకర్ కెసిఆర్ అంటూ విమర్శించిన బండి సంజయ్, గతంలో కెసిఆర్ పాస్ పోర్టుల దందాలు చేసి జైలుకు పోయాడని ఆరోపించారు. కెసిఆర్ కు వయసు మీద పడిందని, డిప్రెషన్ లోకి వెళ్ళాడని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ కొడుకు కూతురు పాల్గొన్నారా.. అని ప్రశ్నించిన బండి సంజయ్, చెప్పులు, హ్యాండ్ బ్యాగులు పెట్టి బతుకమ్మ ఆడిన ఘనత కెసిఆర్ కూతురు కవితది అని విమర్శించారు. ఇక కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుకు పెట్రోలు దొరికిద్ది కానీ అగ్గిపెట్ట దొరకదు అంటూ సెటైర్లు వేశారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ లో కుక్కకు ఉన్న విలువ ప్రజలకు లేదా?
కేసీఆర్ ఫామ్ హౌస్ లో కుక్కకు ఉన్న విలువ కూడా ప్రజలకు లేదా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బండి సంజయ్. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కెసిఆర్ హామీలను మర్చిపోయారని విమర్శించారు. చేనేత బీమా, ఇంటికో ఉద్యోగం, లక్ష రుణమాఫీ, దళితులకు 3 ఎకరాలు, దళితబంధు హామీ ఏమైంది? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ వరి వేసి కోటీశ్వరుడు అయ్యాడు... రైతులను బికారులను చేశాడని నిప్పులు చెరిగారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాడు కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు.
Recommended Video


కేసీఆర్ అంటే... ఖాసీం చంద్రశేఖర్ రజ్వి అంటూ మండిపడిన బండి సంజయ్
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే జైల్లో పెడతారని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ అంటే... ఖాసీం చంద్రశేఖర్ రజ్వి. కేటీఆర్ అంటే సయ్యద్ మక్బుల్ అని పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇష్టం వచ్చిన హామీలు ఇస్తాడు. ఆ తర్వాత ఆ హామీలను విస్మరిస్తాడు అంటూ బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల విషయంలో నేను చెబుతున్న లెక్కలు తప్పయితే... నా మీద కేసులు పెట్టుకోండని పేర్కొన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు అధికారం ఇచ్చారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అంటూ బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications