టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా
Jubilee Hills bypoll: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష పెడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ.. ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. దీన్ని హస్తగతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారంటే.. ఈ ఎన్నికను ఆ పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొత్తం ముగిసింది. ఆయా పార్టీలన్నీ ప్రచారబరిలో దిగాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.

తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బోరబండ డివిజన్ లో ఆయన పర్యటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేశారు. పలు ఆరోపణలను సంధించారు. తాను కట్టర్ హిందువునని, ఇతర మతాలకు చెందిన వారి టోపీ పెట్టుకుని, దొంగ నమాజ్ చేసి కించపర్చనని అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే తల నరుక్కుంటా గానీ టోపీ పెట్టుకోనని తేల్చి చెప్పారు.
మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని ఆరోపించారు. ఈ మాట స్వయంగా గోపీనాథ్ తల్లి చెప్పారని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపీనాథ్ చావుపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. కేటీఆర్ కు వావి వరసల్లేవని, చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేదని, సీఎం పదవి కోసం ఏమైనా చేసే రకమని విమర్శించారు. అందుకే కేసీఆర్ ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తండ్రి బాగోగులు చూసుకోవాలని కవితకు సూచించారు.
రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగలు పీక్క తినేటోడు వచ్చాడని హెచ్చరించారు. ఎంఐఎం నాయకులను బండి సంజయ్ చైన్ స్నాచర్స్ తో పోల్చారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పొరపాటున కాంగ్రెసోళ్లు గెలిస్తే ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళ సూత్రం కూడా గుంజుకుపోతారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే రూ.9,000 కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
లక్ష కోట్ల రూపాయల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రావు వచ్చినా, రెడ్డి వచ్చినా తాము చెప్పినట్లు వినాల్సిందేనని అసదుద్దీన్ ఒవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లని ధ్వజమెత్తారు. మంత్రి అజరుద్దీన్ తో గణేషుడి మంత్రాన్ని చదవించే దమ్ము, ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ టెంపుల్ కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications