నల్గొండలోనే కాదు, ఖమ్మంలోనూ: బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారంపై బండి సంజయ్
నల్గొండ: ప్రజా వ్యతిరేక టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత కదిలిరావాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతి బీజేపీ కార్యకర్త కూడా ఉగ్రనరసింహ అవతారం ఎత్తి.. సీఎం కేసీఆర్ను గద్దె దించాలన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని వంగపల్లిలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

నల్గొండలోనే కాదు.. ఖమ్మంలోనూ బీజేపీని చూపిస్తాం
నల్గొండలో బీజేపీలో ఎక్కడ ఉంది అన్నోళ్లకు ఈ రోజు చూపించామన్నారు. త్వరలోనే ఖమ్మంలోనూ బీజేపీని చూపిస్తామన్నారు. రజాకార్లను తరిమికొట్టిన గడ్డ నల్గొండ అని.. నల్గొండకు కేసీఆర్ సర్కారును తరిమికొట్టే శక్తి ఉందన్నారు. బుక్కెడు బువ్వ కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, గురుకుల పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి నిజాయతీ ఉంటే ట్రిపుల్ ఐటీ, గురుకుల పాఠశాలల్లో భోజనం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

తెలంగాణలోనే ఏమీ చేయలేదు, కానీ, ఢిల్లీకి ఎందుకు?: బండి
తెలంగాణలో ఏమీ చేయని కేసీఆర్.. ఢిల్లీ రాజకీయ సమీకరణాలు మారుస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. మోసం చేశారని మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత బంధు ఎంతమందికి వచ్చిందని ప్రశ్నించారు. ఉచితంగా యూరియా ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పటి వరకు ఒక్కరికైనా ఇచ్చారా? అని బండి సంజయ్ నిలదీశారు. చేనేత బీమాను సీఎం కేసీఆర్ ఏడాది క్రితం ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. ఎవరికిచ్చారో చెప్పాలన్నారు. చేనేత బీమా ఇచ్చే వరకు బీజేపీ ఊరుకోదన్నారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నాకే సీఎంగా ప్రమాణం
తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేసిన యువత.. బీజేపీ కోసం పనిచేయాలని బండి సంజయ్ కోరారు. రాష్ట్రంలో కుటుంబ రహిత పాలన కోసం మద్దతు ఇవ్వాలన్నారు. ఏ సర్వేల్లో చూసినా బీజేపీకి అనుకూలంగా ఫలితాలున్నాయన్నారు బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నాకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని స్పష్టం చేశారు. కాగా, సభ ముగిసిన అనంతరం బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించారు. ఈ యాత్రను కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాషాయ జెండాను ఊపి ప్రారంభించారు. భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు సంజయ్ వెంట కదిలారు.












Click it and Unblock the Notifications