బండి సంజయ్ పాదయాత్ర ముగింపు: భారీగా అమిత్ షా సభ; తెలంగాణా రాజకీయాలపై కీలకప్రకటన!!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి నిర్వహించిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనుంది బిజెపి. ఈ సభకు అమిత్ షా వస్తున్నారు.

బండి సంజయ్ పాదయాత్ర... ముగింపు సభకు అమిత్ షా
తొలివిడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించిన సమయంలో సెప్టెంబర్ 17 వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా నిర్మల్ సభకు వచ్చారు. మళ్లీ ఏడాదిలోపే అమిత్ షా తెలంగాణ పర్యటన కు వస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం, పార్టీని ప్రజాక్షేత్రంలో బలోపేతం చేయడం కోసం, కేసీఆర్ సర్కారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయడం కోసం బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ఏప్రిల్ 14వ తేదీన అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించారు. ఇక రెండో విడత పాదయాత్ర గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో సాగింది. ఆలంపూర్, గద్వాల మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్ , మహేశ్వరం నియోజకవర్గాలలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది.

భారీగా సభా ఏర్పాట్లు .. అమిత్ షా సభపై సర్వత్రా ఆసక్తి
ఇక పాదయాత్రలో చివరి రోజైన మే 14న సాయంత్రం నిర్వహించనున్న చలో తుక్కుగూడ సభకు ఇప్పటికే సభ ఏర్పాట్లను పూర్తి చేసిన బిజెపి నాయకులు, అమిత్ షా సభ రాష్ట్రంలో ఎటువంటి మార్పులకు కారణం కాబోతుందో అన్న ఆసక్తితో ఉన్నారు. అమిత్ షా సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపడంతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై, అమిత్ షా ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు కేసీఆర్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

40 ఎకరాల్లో ఐదు లక్షలకు మించిన జనాలతో అమిత్ షా సభ
కెసిఆర్ కుటుంబ పాలనను, అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సమయంలో మంత్రి అమిత్ షా సభలో ఏం మాట్లాడుతారు. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల లక్ష్యంగా, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఓ మార్గంగా ఈరోజు తుక్కుగూడ లో నిర్వహించనున్న సభ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది బిజెపి. ఇక ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ కు సంబంధించిన ప్రధాన వేదికతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బిజెపి నేతలు మొత్తం 40 ఎకరాల్లో ఐదు లక్షలకు మించిన జనాలతో ఈ సభను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక పోలీసులు అమిత్ షా పర్యటన నేపధ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు చేశారు.

అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇలా .. తెలంగాణా రాజకీయాలపై కీలక ప్రకటన
ఈరోజు మధ్యాహ్నం 2.30 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత మూడు గంటలకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సందర్శిస్తారు. అనంతరం 4. 30 నిమిషాల వరకు అక్కడే ఉండి కేంద్ర హోం మంత్రి అమిత్ షా 5గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని నోవాటెల్ హోటల్ కి వెళ్తారు. ఇక సాయంత్రం 6. 30 నిమిషాలకు తుక్కుగూడ సభాస్థలికి వస్తారు. సభలో ప్రసంగం అనంతరం ఆపై రాత్రి 8 గంటలకు సభ నుంచి ఎయిర్ పోర్టుకు వెళతారు. ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు హోంమంత్రి అమిత్ షా. ఈ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications