కేటీఆర్తో బీజేపీ నేతల భేటీ.. భగ్గుమంటున్న బండి సంజయ్.. అధ్యక్షుడికే తెలియకుండా ఎలా కలుస్తారు..?
తెలంగాణ మంత్రి కేటీఆర్తో రాష్ట్ర బీజేపీ నేతల భేటీని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కేవలం ఒక కార్పోరేటర్ సీటు ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీతో చర్చలు జరపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు ఈ ప్రతిపాదన ఎవరు తీసుకొచ్చారు... ఎవరి నేత్రుత్వంలో ఇదంతా జరిగింది... ఇవన్నీ నిగ్గు తేల్చేందుకు ఒక కమిటీని కూడా నియమించింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పార్టీ బలపడుతున్న వేళ... అధికార పార్టీతో మంతనాలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.
కమిటీ ఏర్పాటు...
కేటీఆర్తో భేటీ వ్యవహారం వెనుక ఎవరున్నారు... ఎవరి డైరెక్షన్లో ఇదంతా జరిగిందో తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముగ్గురు పార్టీ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్టీ సీనియర్ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్,బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఉన్నారు. రెండు రోజుల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాల్సిందిగా ఈ కమిటీని కోరారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ నివేదికను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు.
ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై,టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంత ధాటిగా విమర్శలు గుప్పించారో అందరికీ తెలిసిందే. టీఆర్ఎస్,ఎంఐఎం ఒక్కటేనని... టీఆర్ఎస్ హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని... ఇలా పదునైన విమర్శలు చేశారు. తీరా ఇప్పుడు బీజేపీ నేతలు మంత్రి కేటీఆర్ను కలిసి లింగోజిగూడ కార్పోరేటర్ ఉపఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని కోరడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించేలా మారింది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని.. టీఆర్ఎస్ రజకార్ల పాలనను అంతమొందిస్తామని చెప్పే బీజేపీ... ఇలా కేటీఆర్ వద్దకు వెళ్లి చర్చలు జరపడమేంటని చాలామంది సందేహిస్తున్నారు.
నేతల మధ్య గ్యాప్..?
అసలు ఈ వ్యవహారం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్కి తెలియకుండా జరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా కేటీఆర్ను కలిసే సాహసం చేశారంటే... వాళ్ల వెనుక మరో పెద్ద నేత ఎవరైనా ఉండాలి అన్న చర్చ జరుగుతోంది. నిజానికి పార్టీలో కిషన్ రెడ్డికి,బండి సంజయ్కి మధ్య విభేదాలున్నాయని... ఇద్దరికీ పొసగట్లేదన్న ప్రచారం కూడా ఉన్నది. ఇదే తరుణంలో ఇప్పుడీ ఘటన చోటు చేసుకోవడం పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉందన్న విషయాన్ని బయటపెట్టినట్లయింది. మరి బండి సంజయ్ నియమించిన కమిటీ... ఈ వ్యవహారానికి ఎవరిని బాధ్యులుగా తీర్మానిస్తుందో... వారిపై ఎటువంటి చర్యలు ఉంటాయో వేచి చూడాలి.