కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది.. ఎన్డీయే సీట్లు ఆ కుట్రలతోనే తగ్గాయి: బండి సంజయ్ సంచలనం
కరీంనగర్ బరిలో హోరాహోరీగా పోరాడిన బండి సంజయ్ ఈరోజు తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలలో సత్తా చాటారు. రికార్డ్ బ్రేక్ చేస్తూ భారీ మెజారిటీతో గెలుపొందారు. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కు 89 వేల 508 ఓట్ల మెజారిటీ కట్టబెట్టిన ప్రజలు... ఈసారి ఏకంగా 2 లక్షల 25వేల పైచిలుకు ఓట్లు కట్టబెట్టి బండి సంజయ్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కేసీఆర్ అడ్రస్ గల్లంతయ్యింది
బండి సంజయ్ విజయం సాధించడంతో కరీంనగర్లో బిజెపి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం బండి సంజయ్ వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను ఓడించాలని కుట్రలు చేస్తే, కెసిఆర్ అడ్రస్ మొత్తానికే గల్లంతయింది అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. బండి సంజయ్ గలీజోడు... ముస్లింలంతా ఏకమై ఆయనను ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారని.. కానీ అందరూ ఏకమై నన్ను భారీ మెజారిటీతో గెలిపించారన్నారు.

తనపై ఎన్ని కుట్రలు చేసినా కరీంనగర్ ప్రజలు ఆదరించారు
తనను ఓడించేందుకు ఒక వర్గం ఓట్లను ఏకం చేయాలనుకున్న కేసీఆర్, కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి కరీంనగర్ ప్రజల దమ్ము చూపారని కొనియాడారు. కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హవాతోనే తనకు ఇంతటి మెజారిటీ దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాడి ఆ పార్టీ అంతు చూస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ కు బండి సంజయ్ హెచ్చరిక
తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. కాంగ్రెస్ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.. 6 నెలలు దాటింది. మరో 3 నెలలు టైమిస్తున్నాం...ఇచ్చిన మాటకు కట్టుబడి 6 గ్యారంటీలతోసహా హామీలన్నీ అమలు చేసి తీరాలని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేనిపక్షంలో ప్రజలందరినీ ఏకం చేస్తాం.. తెగించి కొట్లాడతాం. కాంగ్రెస్ సంగతి చూస్తాం అన్నారు.
దేశంలో ఎన్డీయే కూటమి సీట్లు తగ్గటానికి కారణాలివే
రాజ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఇండీ కూటమి దేశవ్యాప్తంగా విష ప్రచారం చేసిందని, ఇంటికో లక్ష రూపాయలు అకౌంట్లో వేస్తామంటూ సాధ్యంకాని హామీలు గుప్పించి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసిందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తో పాటు ఇండి కూటమిని టార్గెట్ చేశారు. దక్షిణ భారతం, ఉత్తర భారతం అంటూ దేశాన్ని చీల్చేందుకు కూడా వెనుకాడలేదు.. వీటితో ప్రజలు అయోమయానికి గురయ్యారు. లేకుంటే ఎన్డీఏకు 4 వందల సీట్లు వచ్చేవన్నారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications