ఏపీ, తెలంగాణ సీఎంల గెలుపు తంత్రం ఇదే: బండి సంజయ్, సభలో భావోద్వేగంతో కన్నీళ్లు
కరీంనగర్: తెలంగాణ సీఎం కేసీఆర్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కరీంనగర్లో జరిగిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపుసభలో బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ గడ్డ తనకెంతో ఇచ్చిందని అన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు.

కరీంనగర్ సభలో కన్నీళ్లు పెట్టుకున్న బండి సంజయ్
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోతే కార్యకర్తలు ఏడ్చారని.. దానిపై దేశం అంతా చర్చ జరిగిందని బండి సంజయ్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఎప్పుడూ ధర్మబద్ధంగానే నడుచుకుంటానని అన్నారు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కనని అన్నారు. కార్యకర్తల కష్టాన్ని చూసే తనకు మళ్లీ బీజేపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు.
కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని.. కార్యకర్తల కష్టం వల్లే తాను లక్ష మెజార్టీతో గెలిచానని చెప్పారు. అవమానాలకు తాను భయపడనని చెప్పారు. మోడీని ప్రధాని చేయాలనే తనను ఎంపీగా గెలిపించారని కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీ కష్టం చూసే బీజేపీ జాతీయ నాయకత్వం తనను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని చేసిందని చెప్పారు. ఆ పదవికి న్యాయం చేసేందుకే తిరుగుతున్నానని తెలిపారు. కరీంనగర్ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. మీ కోసమే పనిచేస్తానన్నారు.

కేసీఆర్ పీడపోయింది! కాషాయ జెండాతో తెలంగాణ పవిత్రం: బండి
పింక్ జెండాతో అపవిత్రమైన తెలంగాణను కాషాయ జెండాతో పవిత్రం చేయమని జాతీయ నాయకత్వం సూచించిందని, మోడీ, షా, నడ్డా చెప్పారని బండి సంజయ్ తెలిపారు. అందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు బండి సంజయ్ తెలిపారు. గడీల పాలన, రాక్షస పాలన, కుటుంబ పాలనను అంతం చేసే బాధ్యతను అందరూ తీసుకోవాలన్నారు.
తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో జెండాలు పక్కన పనిచేశామన్నారు. టీఆర్ఎస్కు రెండు సార్లు అధికారం ఇస్తే.. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ బయటకు పంపించేశారని.. ఇప్పుడు తెలంగాణ పేరును కూడా తీసేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్తో ఢిల్లీకి పోయిండని.. తెలంగాణకు కేసీఆర్ పీడ పోయిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్తో దేశాన్ని దోచుకునేందుకు వెళ్లారన్నారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు బండి సంజయ్.

తెలంగాణకు బీజేపీ, మోడీ అండగా ఉంటుందన్న సంజయ్
తెలంగాణకు బీజేపీ, నరేంద్ర మోడీ అండగా ఉంటారని బండి సంజయ్ తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేడు, భూసేకరణ చేస్తలేడు, తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కేంద్రానికి సహకరించడం లేదని మండిపడ్డారు. కేంద్రం నిధులను మళ్లిస్తున్నారని ఆరోపించారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చినా.. ఇప్పటి వరకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇక్కడికి వచ్చినవారిలో ఎవరికైనా డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చాయా? అని ప్రశ్నించగా.. రాలేదంటూ జనం నుంచి నినాదాలు వినిపించాయి.
దోచుకుందాం.. దాచుకుందామనే ఏపీ, తెలంగాణ సీఎంలు: సంజయ్
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికార పార్టీలు సెంటిమెంటుతో మళ్లీ గెలవాలని చూస్తున్నారని ఏపీ, తెలంగాణ సీఎంలపై బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇద్దరు కలిసి రకరకాల వంటలతో విందు చేసి, హత్తుకున్నారని చెప్పారు.
నిన్ను ప్రజలు తిరస్కరిస్తే నువ్వు జై ఆంధ్రా అను.. నన్ను ప్రజలు తిరస్కరిస్తే జే తెలంగాణ అంట అని పథకం వేశారని బండి సంజయ్ అన్నారు. కలిసి పంచుకుందాం.. కలిసి దోచుకుందాం అని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఒప్పందాలు చేసుకున్నారని కేసీఆర్, జగన్ పేరు ఎత్తకుండానే ఆరోపణలు చేశారు బండి సంజయ్.

కేసీఆర్ అంతా నాశనం చేశారన్న బండి సంజయ్
తెలంగాణ ఏర్పడే సమయంలో 5 లక్షల ఉద్యోగాలు ఉండాల్సి ఉండగా.. లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇప్పుడు తెలంగాణలో మూడు లక్షలు మాత్రమే ఉన్నాయి. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేసీఆర్ సర్కారు భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు కేసీఆర్ అని ప్రశ్నించాడు.
మోడీ ప్రభుత్వం మొన్ననే లక్షా 46వేల ఉద్యోగాలిచింది. ఏడాదిలో పది లక్షల ఉద్యోగాలిస్తామన్నారని చెప్పారు. నిరుద్యోగ భృతి కూడా ఇస్తలేరన్నారు. కేసీఆర్ సర్కారు విద్యాలయాలను నాశనం చేసిందన్నారు.
కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. చదువుకోనిస్తలేడు, చదువుకున్నోళ్లకు ఉద్యోగలిస్తలేడు, ఉద్యోగస్తులకు జీతం ఇస్తలేడని కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు. ఒకటో తారీఖు జీతం ఇచ్చే ప్రభుత్వం రావాలన్నారు.

ధనిక రాష్ట్రమని.. అప్పుల కుప్పచేశారు: కేసీఆర్పై బండి సంజయ్
కేసీఆర్ సర్కారు 5 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఏడాదికి రూ. 30వేల కోట్లు వడ్డీనే కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని బండి సంజయ్ అన్నారు. మళ్లీ కేసీఆర్ ను గెలిపిస్తే మరో 5 లక్షల కోట్ల అప్పులు చేసి.. ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షల అప్పు చేస్తాడని అన్నారు. ధనిక రాష్ట్రం చేస్తా అంటున్నావు.. అంటే.. కేసీఆర్ చెప్పడం లేదని అన్నారు.
ధరణి తో పేదల భూములు కాజేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల సమస్యలు వెలుగుచూస్తున్నాయన్నారు. ఈ యాత్ర ద్వారానే కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటికి వచ్చిండన్నారు. కేసీఆర్ను తరిమికొడతామన్నారు. అక్రమ కేసులు పెట్టినా.. బీజేపీ కార్యకర్తలు భయపడటం లేద్నారు. దీంతోనే ఇక్కడ ఫైనాన్స్ దుకాణం మూసేసి.. మొన్న ఢిల్లీలో బ్రాంచీ ఆఫీసు పెట్టారని ఆరోపించారు.
బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని, బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని, గుంటనక్కల పార్టీ అని అన్నారు. ఒక్క నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు గుంటనక్కలన్నీ ఒక్కటవుతున్నాయన్నారు. మన కోసం మోడీ 18 గంటలు పనిచేస్తున్నాయన్నారు. పాదయాత్ర తెలంగాణ ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నామన్నారు. మైంసాలో కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు.












Click it and Unblock the Notifications