దాడికి కేసీఆర్ సూత్రధారి..మండిపడిన బండి సంజయ్; 2వ రోజు పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. టీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతుంది. ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. సోమవారం నల్గొండ జిల్లాలో ఆర్జాలబావి, మిర్యాలగూడలలో బండి సంజయ్ ఐకెపి కేంద్రాల వద్దకు వెళ్ళిన క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల పర్వం కొనసాగేలా కనిపిస్తుంది. ఇప్పటికే బండి సంజయ్ గొ బ్యాక్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నారు.
సోమవారం ఆద్యంతం ఉద్రిక్తతల నడుమ సాగిన బండి సంజయ్ పర్యటన
సోమవారం నల్గొండ జిల్లాలో ఆర్జాలబావి, మిర్యాలగూడలలో ఐకేపీ కేంద్రాల వద్దకు వెళ్లి రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వర్షాకాలంలో రైతులు సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. రైతు పండించిన ధాన్యం కొనుగోలు చేయని కేసీఆర్ సర్కారు తీరును ఎండగట్టటానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన బండి సంజయ్ పర్యటనను అడ్డుకోవడానికి టిఆర్ఎస్ శ్రేణులు విఫల ప్రయత్నాలు చేశారు.
బండి సంజయ్ కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారు. రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లతో విరుచుకుపడ్డారు.అడుగడుగున అడ్డుకునేందుకు టిఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడంతో,వారిని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను కంట్రోల్ చేయాల్సి వచ్చింది.
దాడులకు సీఎం కేసీఆర్ ప్రధాన సూత్రధారి .. మండిపడిన బండి సంజయ్
టీఆర్ఎస్ శ్రేణుల దాడి ఘటనపై సీరియస్ గా స్పందించిన బండి సంజయ్ టిఆర్ఎస్ శ్రేణులు మాపై దాడులు చేయడానికి సీఎం కెసిఆర్ ప్రధాన సూత్రధారి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్షాకాలం పంట కొనాలని కోరితే దాడులు చేస్తారా అంటూ బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు. నల్గొండ, మిర్యాలగూడలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలు, బండి సంజయ్ కాన్వాయ్ పై జరిగిన రాళ్ల దాడి పై సూర్యాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ బయటకు రారని, ప్రగతి భవన్ కే పరిమితమయ్యారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ దాడిలో 8 వాహనాలు ధ్వంసం.. పోలీసులు ఫెయిల్యూర్
సమస్యలు పరిష్కరించ వలసిన వాళ్ళు, సమస్యలను పరిష్కరించకుండా ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడులలో ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారని మండిపడ్డారు. బిజెపి పర్యటన షెడ్యూల్ ఇచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని, బిజెపి పర్యటనను అడ్డుకునేందుకు టిఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నా పోలీసులు వారిని నిలువరించలేదని వారిపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. వర్షాకాలం పంటను కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పిన బండి సంజయ్ మంగళవారం సూర్యాపేట జిల్లాలో, జనగామలో రెండవ రోజు పర్యటనను కొనసాగించనున్నారు. ఉమ్మడి నల్గొండలో రెండవ రోజు బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో మంగళవారం కూడా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం నాడు జరిగిన పర్యటన అంత ఘర్షణలు, రాళ్ల దాడులు, తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగగా, మంగళవారం కూడా అదే పరిస్థితి కనిపించేలా ఉంది.
పర్యటన చేస్తామంటున్న బండి సంజయ్ .. అడ్డుకుంటామన్న టీఆర్ఎస్ .. టెన్షన్ టెన్షన్
ఇప్పటికే బండి సంజయ్ పర్యటనను అడ్డుకుని తీరుతామని టిఆర్ఎస్ శ్రేణులు తేల్చి చెప్పారు. మంగళవారం బండి సంజయ్ సూర్యాపేట, జనగామలలో ఐకెపి సెంటర్లను పరిశీలించనున్నారు. అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో టిఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ ను అడ్డుకుని తీరుతామని తేల్చి చెబుతున్నారు.
జనగామ లో అడుగుపెడితే ఎర్రబెల్లి వర్గీయులు అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు . పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో వివిధ జిల్లాల నుండి బండి సంజయ్ పర్యటనకు మద్దతుగా వెళ్లాలని ప్రయత్నిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వ అణచివేతపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.