కేసీఆర్! బీసీ బంధు అమలు చేయండి: ఆ హామీలేమయ్యాయంటూ బండి సంజయ్ ప్రశ్నలు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు తాజాగా మరో లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ బందు అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీల సమస్యలపై కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు.
అర్హులైన ప్రతి బీసీ కుటుంబానికి రూ. 10 లక్షలు సాయం అందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీ బంధు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు.
కేసీఆర్ సర్కారు బీసీ సబ్ ప్లాన్ అటకెక్కించిందని బండి సంజయ్ మండిపడ్డారు. 46 బీసీ కులాలను నిర్మిస్తామన్న ఆత్మగౌరవ భవనాల అడ్రస్ ఎక్కడ? చేనేత కార్మికులకు బీమా, హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. గీత కార్మికులకు ఆదుకోకపోవడంతోపాటు రజకులకు దోబీ ఘాట్లు నిర్మించాలన్నారు. నాయీ బ్రాహ్మణలకు 200 యూని్టల విద్యుత్ ను ఉచితంగా ఇవ్వాలన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ కు సమృద్ధిగా నిధులు కేటాయించాలని, రూ. 3400 కోట్ల ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మరోవైపు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే దళిత బంధు పథకాన్ని మంత్రి హరీశ్ రావు తన సిద్దిపేట నియోజకవర్గంలో అమలు చేయాలని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. దళితబంధు నిజమే అయితే హరీశ్ సొంత నియోజకవర్గంలో ఎందుకు అమలు చేయడం లేదు? ఇక్కడ తిరుగుతున్న నర్సంపేట, పరకాల, పెద్దపల్లి ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల్లో ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలి..' అని ప్రజలకు ఈటల పిలుపునిచ్చారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక ధర్మానికి, టీఆర్ఎస్ ప్రభుత్వ అధర్మానికి జరుగుతున్న పోరు.. నా కొట్లాట బానిసల మీద కాదు.. నా కొట్లాట కేసీఆర్ మీదే.. నియోజకవర్గంలో 18 ఏళ్లుగా ఏ పని చేయకపోతే ఇక్కడి ప్రజలు నన్ను ఎలా గెలిపిస్తారు. నన్ను చేతకాని వాడంటారా.. నా జోలికి వస్తే ఖబడ్దార్.. సముద్రం ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది.. తుఫాన్ వస్తే అప్పుడు ప్రళయాన్నే చూపిస్తుంది. కౌశిక్రెడ్డి నా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.. నీకు ఈ ఈటల రాజీనామా వల్లే ప్రగతిభవన్లోకి ఎంట్రీ దొరికింది. పదవి రాబోతుంది. కొంచెంగా హుందాగా ప్రవర్తించు. ఇక్కడ దౌర్జన్యాలు జరిగితే ముందుగా చిందాల్సింది నా రక్తపు బొట్టే.. కేసులు పెడితే, జైల్లో పెడితే ముందు నన్నుపెట్టండి' అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
హుజూరాబాద్లో జరుగుతున్న మిడుతల దండు దాడిపై రాష్ర్ట ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని ఈటల ఎద్దేవా చేశారు. రెండు గుంటల ఆస్తి కలిగిన అభ్యర్థి 2 నెలల్లో 250 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నాడు.. ఇదంతా మీ అక్రమ సొమ్ము కాదా.. తెలంగాణ ప్రజల డబ్బుకి నువ్వు ఓనర్ కాదు. కేవలం కాపాలాదారుడివి మాత్రమే.. ఇది నీ అబ్బ జాగీర్ కాదు.?' అని కేసీఆర్పై ఈటల నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.