డ్యూటీలు ఎగ్గొట్టే డాక్టర్లారా జాగ్రత్త.. మీకూ వస్తోంది బయో మెట్రిక్..! గీత దాటితే వేటే..!
హైదరాబాద్ : ఆస్పత్రులకు డుమ్మా కొట్టే సర్కారీ వైద్యులకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. త్వరలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలనే యోచన చేస్తుంది. పీహెచ్సీల రూపురేఖల్ని సమూలంగా మార్చే ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో 650 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా, వాటిల్లో పూర్థిస్థాయిలో వైద్యులు లేరు. మరో 300 మంది వైద్యులు అవసరమవుతారని అంచనా. గత ఏడాది 520 మంది వైద్యుల నియామకాలు చేపట్టిన ప్రభుత్వం, వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపింది.

పీహెచ్సీల్లో బయోమెట్రిక్ విధానం..! ఎగనామం పెడితే కొలువు పోయినట్టే..!!
అయితే చాలా చోట్ల వైద్యులు విధులకు ఎగనామం పెడుతున్నారు. మరికొంత మంది ఆస్పత్రులకు దూరంగా నివాసముంటూ.. సకాలంలో విధులకు హాజరు కాలేకపోతున్నారు. ఇంకొందరు వైద్యులు మొక్కుబడిగా వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీంతో సర్కారీ దవాఖానాల్లో డాక్టర్లు ఉండటం లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుంది. రాష్ట్రంలో ఉన్న పీహెచ్సీలో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలని సర్కారు యోచిస్తోంది. దీంతో వైద్యులు తప్పనిసరిగా పీహెచ్సీల్లో అందుబాటులో ఉంటారని భావిస్తోంది.

బయోమెట్రిక్ హాజరు విధానం..! పక్కా డ్యూటీ కి రావాల్సిందే..!!
గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీల సేవలు అత్యంత కీలకమైనవి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలి. కొన్ని పీహెచ్సీలు 24 గంటలు పనిచేస్తున్నాయి. కానీ.. వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో.. బయోమెట్రిక్ హాజరును సర్కారు తెరపైకి తేనుంది. ఈ విధానంతో వైద్యులు, ఇతర సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరించడానికి వీలుండదు. సమయపాలనకు అవకాశముంటుంది. అసలు డాక్టర్ వస్తాడో? రాడో? తెలియని పరిస్థితి నుంచి.. పీహెచ్సీల్లో కచ్చితంగా వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకాన్ని ప్రజల్లో తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ఆధునిక హంగులు..! తప్పించుకోలేని డ్యూటీ డాక్టర్లు..!!
రాష్ట్రంలో చాలా చోట్ల పీహెచ్సీల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నింటిని ఖాళీ చేయించి.. ప్రత్యామ్నాయ భవనాల్లోకి, ఉపయోగంలో లేని ప్రభుత్వ పాఠశాలల్లోకి మార్చారు. చాలా పీహెచ్సీ భవనాల గోడలకు నెర్రెలు వచ్చి, పైకప్పుల పెచ్చులూడుతున్నాయి. కనీసం సున్నం వేయించే పరిస్థితి కూడా లేకపోవడంతో వర్ణవిహీనంగా మారాయి. విరిగిన కుర్చీలు, బల్లలు, బెంచీలు, తుప్పుపట్టి అలంకారప్రాయంగా మారిన అల్మారాలు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీహెచ్సీలను ఆధునికీకరించి, కనీస మౌలిక సదుపాయాల కల్పన దిశగా సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

ఉద్యోగుల హేతుబద్ధీకరణ..! కసరత్తు చేస్తున్న యంత్రాంగం..!!
రాష్ట్రంలో చాలా పీహెచ్సీల్లో సిబ్బంది కొరత ఉంది. కొన్ని ఆస్పత్రుల్లో అవసరానికి మించి పడకలుంటే.. ఇంకొన్ని ప్రాంతాల్లో పడకల కొరత తీవ్రంగా ఉంది. దీనిపైనా సర్కారు దృష్టిపెట్టింది. కొన్ని పీహెచ్సీల్లో అవసరానికి మించి సిబ్బంది ఉన్నారు. అలాంటి సిబ్బందిని ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువ మంది సిబ్బంది ఉంటుండగా.. ఏజెన్సీ ప్రాంతాల్లో సిబ్బంది కొరత వివరీతంగా ఉంది.












Click it and Unblock the Notifications