ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం..భద్రాద్రి జిల్లా యువ కలెక్టర్ ఆదర్శం,ఐఏఎస్ అనుదీప్ పై ప్రశంసల వర్షం
ఆదర్శంగా బ్రతకాలి అని చెప్పడం చాలా సులభం.. కానీ అలా బ్రతికి చూపించటం చాలా కష్టం. అది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ భద్రాద్రి జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ దానిని సాధ్యమని చూపించారు. తాను తీసుకున్న నిర్ణయంతో ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నతాధికారులు గా పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులందరికీ ఆయన మార్గదర్శిగా నిలిచారు. ఇంతకీ భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఏం చేశారంటే..
వరి వెయ్యాలా.. వద్దా? తెలంగాణాలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ; కన్ఫ్యూజన్ లో రైతులు!!
ప్రభుత్వాసుపత్రులపై విశ్వాసం పెంచేలా భద్రాద్రి కలెక్టర్ చర్య
సాధారణంగా పేద, సామాన్య ప్రజలు తప్ప మధ్యతరగతి ప్రజలు కూడా డెలివరీ లకు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లడం లేదు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో ఎలాంటి విశ్వాసం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య వసతులు లభిస్తాయన్న భావన ప్రజలకు లేదు. ఆస్పత్రుల్లో వైద్యులు ఉండరని, సిబ్బంది పట్టించుకోరని అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి, ప్రభుత్వం నిర్వహించే ఆసుపత్రిలో వైద్య సేవలను ప్రజల దృష్టికి తీసుకు వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తన భార్య డెలివరీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా వైద్యశాలలో చేర్పించారు.
భద్రాద్రి ఏరియా వైద్యశాలలో కలెక్టర్ సతీమణి మాధవికి డెలివరీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి తన తొలి కాన్పును భద్రాద్రి ఏరియా వైద్యశాలలో చేయించడం భద్రాద్రి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. డెలివరీకి వెళ్ళిన మాధవికి సర్జరీ చెయ్యటం అనివార్యం కాగా ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు గైనకాలజిస్టులు సూరపనేని శ్రీ క్రాంతి, డాక్టర్ భార్గవి, అనస్తీషియా వైద్యనిపుణులు దేవిక ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించారు. ఆమె తొలి కాన్పులో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆపరేషన్ తర్వాత శిశువును ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వై రాజశేఖర్ రెడ్డి పరీక్షించి వైద్యం అందించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
సామాన్యుడిగా భద్రాద్రి కలెక్టర్
ఒక జిల్లా కలెక్టర్ సామాన్యుడులాగా తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకోవడంపై ప్రశంసలు వెల్లువ గా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ చర్యతో ప్రభుత్వ ఆసుపత్రుల పైన మరింత గౌరవం పెరుగుతుందని, ప్రజల్లో ఉన్న దురభిప్రాయం మారుతుందన్న భావన వ్యక్తమవుతోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఆదర్శంగా నిలిచారని చర్చ జరుగుతుంది. కలెక్టర్ అంతటి వాడే ప్రభుత్వ ఆస్పత్రిలో భార్యకు డెలివరీ చేయించాడని అందరూ అనుకుంటున్నారు.
దేశంలోనే సివిల్స్ పరీక్షలో టాపర్.. మొదటి ర్యాంకు సాధించిన అనుదీప్
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాకు చెందిన అనుదీప్ 2017 లో సివిల్స్ పరీక్షలో దేశంలోనే తొలి ర్యాంకు సాధించి టాపర్ గా నిలిచారు. ప్రస్తుతం భద్రాద్రి జిల్లా కలెక్టర్ గాను ప్రజలకు సేవ చేస్తూనే, పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన తన భార్య డెలివరీని కూడా ప్రభుత్వాసుపత్రిలో చేయించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ కు హ్యాట్సాఫ్ చెప్తూ నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. మిగతా ఉన్నతాధికారులంతా ఆయనను ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు.