భద్రాద్రి రాముడి సాక్షిగా.. ఇందిరమ్మ ఇళ్ళపై శుభవార్త!
తెలంగాణప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇల్లు లేని నిరుపేదల కోసం రేవంత్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. లబ్ధిదారులకు పదేపదే సూచనలు చేస్తూ గృహప్రవేశాలు కు సిద్ధం చేస్తున్నారు.
భద్రాద్రి శ్రీ రాములవారి సాక్షిగా చారిత్రక ఘట్టం
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈనెల 21వ తేదీ న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈనెల 21వ తేదీన భద్రాద్రి శ్రీ రాములవారి సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో మరొక చారిత్రక ఘట్టం జరగబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

రేవంత్ సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాలు
కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండ మండలం బెండలం పాడులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 312 మంది పేదలకు బెండలం పాడు గ్రామంలో ఇల్లు మంజూరు కాగా, వాటిల్లో 72 ఇల్లు పూర్తయ్యాయని, అందులో 27 ఇళ్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహప్రవేశం జరగనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
రేవంత్ బహిరంగ సభ
గతంలో భద్రాద్రి రాముని సన్నిధిలోనే ఈ పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్న ఆయన భద్రాద్రి నేలపైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం జరగడం చాలా సంతోషదాయకమైన విషయం అన్నారు. ఇక గృహప్రవేశాలు చేసిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కులమతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
రేవంత్ పర్యటన నేపధ్యంలో ఏర్పాట్ల పరిశీలన
రేవంత్ రెడ్డి గృహప్రవేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లను సందర్శించి, నిర్మాణ తీరును పరిశీలించారు. అలాగే హెలిపాడ్ ఏర్పాటుకు, సభా ప్రాంగణానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం రానున్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు, వీఐపీల ప్రోటోకాల్, ప్రజల రాకపోకల నియంత్రణ తదితర అంశాల పైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications