కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించిన భారత్ బయోటెక్, తెలంగాణలో 43వేల కేసుల దిశగా.
హైదరాబాద్: నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కరోనా వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు వేసింది. తాము అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ టీకా మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

హైదరాబాద్ నిమ్స్తోపాటు
375 మందితో దేశంలోని 12 ప్రాంతాల్లో తొలి దశ క్లినికల్(మానవ) ట్రయల్స్ను జులై 15న ప్రారంభించినట్లు వెల్లడించింది. కాగా, దేశంలోని 12 ప్రాంతాల్లో ఎయిమ్స్ పాట్నా, పీజీఐఎంఎస్ రోహ్తక్ తోపాటు హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రి కూడా ఉంది.

కోవాగ్జిన్ టీకా అభివృద్ధి..
భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది. భారత్ బయోటెక్కు చెందిన బయో సేఫ్టీ లెవల్ 3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు. కోవాగ్జిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్కు ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) అనుమతిచ్చింది. ఇప్పటికే యూకే, రష్యాతోపాటు అమెరికాలోనూ కరోనా వ్యాక్సిన్ తయారీకి పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. రష్యా, యూకేకు చెందిన పరిశోధనా సంస్థలు కూడా ఇప్పటికే మానవ ట్రయల్స్ ప్రారంభించాయి. ఈ సంస్థలు కూడా కరోనా వ్యాక్సిన్ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించాయి.

తెలంగాణలో 42వేలు దాటిన కరోనా కేసులు
ఇది ఇలావుండగా, తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 1478 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 806 కేసులు ఉండటం గమనార్హం. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 82, వరంగల్ అర్బన్ లో 51, కరీంనగర్ జిల్లాలో 77 కేసులున్నాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 42,496కు చేరింది. ప్రస్తుతం 13,389 యాక్టివ్ కేసులున్నాయి.
Recommended Video

కరోనాతో ఏడుగురు మృతి
కరోనాతో శుక్రవారం ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 403కి చేరింది. రాష్ట్రంలో శుక్రవారం 1410 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 28,705కు చేరింది. ఇప్పటి వరకు తెలంగాణలో 2,37,817 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications