హరిశ్చంద్రా! ఇప్పుడేమంటావ్: చేరికలపై బాబుకు తలసాని చుక్కలు
హైదరాబాద్: 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి తరఫున గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ తదితర ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరినే నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబుపై తలసాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు తాము టిడిపి నుంచి తెరాసలో చేరినప్పుడు సంతలో సరుకుల్లా కొనుక్కున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. హైదరాబాద్ వచ్చి కూడా తమ పైన విమర్శలు చేశారన్నారు.
ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతారన్నారు. వైసిపి నుంచి టిడిపిలో చేరిన వాళ్లతో రాజీనామా చేయించి, మళ్లీ పోటీ చేయిస్తారా అని ప్రశ్నించారు. అలా చేస్తే తాము ఆయనను ఆదర్శంగా తీసుకుంటామన్నారు. లేదంటే తమ పైన గతంలో చేసిన వ్యాఖ్యలు ఆయనకే రివర్స్ అవుతాయన్నారు.
చంద్రబాబు చాలా పెద్ద మనిషి
తమను టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కొన్నారని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఏపీలో టిడిపి కూడా కోట్ల రూపాయలు పెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కొన్నారా చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు చాలా పెద్ద మనిషి అని, ఆయన పదేళ్లు సమైక్య ఏపీకి సీఎంగా పని చేశారని, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పని చేశారన్నారు.
అలాంటి పెద్ద మనిషి తాము పార్టీ మారినప్పుడు ఇష్టారీతిన మాట్లాడారన్నారు. ఇప్పుడు ఏపీలో వైసిపి నేతలను ఆయన చేర్చుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు తమకు క్షమాపణ చెబుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.
వైసిపి నుంచి వచ్చారు.. ఏం చెబుతారు?
ఏపీలో జరుగుతున్న దానికి ఆయన ఏం చెబుతారన్నారు. పార్టీలు మారడంపై నీతులు చెప్పే చంద్రబాబు ఇప్పుడు వైసిపి నేతలు తమ పార్టీలో చేర్చుకోవడంపై ఏం చెబుతారన్నారు. చంద్రబాబు జాతీయ నాయకుడు అన్నారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు.
వారు చాలా పెద్దవాళ్లు అని, అలాంటి నేతలను మేం ఆదర్శంగా తీసుకోవాలని, మమ్మల్ని వాళ్లు ఎందుకు ఆదర్శంగా తీసుకుంటారని ఎద్దేవా చేశారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఏమిటన్నారు. భూమా అఖిల ప్రియ ఫ్యాక్షనిస్ట్ అంటే నేను అయితే నమ్మనని చెప్పారు.
కుటుంబాలను కోల్పోయారు
ఫ్యాక్షనిజంలో చాలామంది టిడిపి నేతలు తమ కుటుంబాలను కోల్పోయారన్నారు. పరిటాల రవీంద్రను కోల్పోయినప్పుడు మేం టిడిపిలోనే ఉన్నామని, జెసి దివాకర్ రెడ్డి పైన రాష్ట్రపతిని కలిశామని చెప్పారు. నిన్న రామసుబ్బా రెడ్డి పెద్దమ్మ కూడా ఏడ్చిందన్నారు.
అలాంటి వారిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం ఏమిటన్నారు. సంతలో కొన్నట్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటున్నారా అని ప్రశ్నించారు. టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయిస్తారా అని నేను మధ్యాహ్నం 12 గంటల దాకా చూశానని చెప్పారు.
సత్యహరిశ్చంద్రా..
ఎందుకంటే చంద్రబాబు సత్యహరిశ్చంద్రుడు, ప్రపంచమే ఆయనను ఆదర్శంగా తీసుకుంటుందని, హైటెక్ సిటీ కట్టించారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏపీలో వైసిపి ఎమ్మెల్యేల చేరికపై ఏం చెబుతారని ఎద్దేవా చేశారు. సత్య హరిశ్చంద్రుడు ఏమైనా దారి తప్పారా అన్నారు.
సింగపూర్, మలేషియా అంటూ..
చంద్రబాబు ఏపీలో సింగపూర్, మలేషియా అంటూ అందర్నీ కలల లోకంలో విహరింప చేస్తున్నారన్నారు. అమాయకులు తెలియక అక్కడ స్థలాలు కొనుక్కొని ఇప్పుడు పరేషాన్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. సత్య హరిశ్చంద్ర మహారాజ్.. చంద్రబాబు గారు.. మిమ్మల్ని మేం ఆదర్శంగా తీసుకోవాలా చెప్పాలని నిలదీశారు.
సమయం వచ్చింది.. మా బాధ చెప్తున్నా
నిన్న మొన్నటి వరకు తమ పైన చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడారని, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మేం మా ఆవేదన, బాధను చెబుతున్నామన్నారు. ఏపీ ప్రభుత్వాలు, పార్టీలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే తమ పైన ఇష్టారీతిన చంద్రబాబు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నామన్నారు.
తాము పార్టీ మారినప్పుడు చంద్రబాబు ఎలా మాట్లాడారో అందరికీ తెలుసునని, ఇప్పుడు వైసిపి ఎమ్మెల్యేలను చేర్చుకున్నందున.. మీకు కూడా అది వర్తిస్తుందన్నారు. వారితో రాజీనామా చేయిస్తే, మేం కూడా సిద్ధమన్నారు. లేదంటే మమ్మల్ని ఏం తిట్టారో అదంతా మీకు వర్తిస్తుందన్నారు.
ఏపీలో చేస్తే నీతి, తెలంగాణలో చేస్తే అవినీతా అని ప్రశ్నించారు. మలేషియా, సింగపూర్ పేరుతో ఏపీ ప్రజలకు చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో టిడిపిలోకి వస్తున్నారని చెప్పడం విడ్డూరమన్నారు. చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందన్నారు.