మరీ ఇంత ఘోరమా? రొట్టెల పిండి పడేసిందని.. కూతురిపై కిరోసిన్ పోసి..
కన్న కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే కిరాతకురాలిగా మారింది. చిన్నపిల్ల అని కూడా చూడకుండా కిరోసిన్ మీద పోసి నిప్పంటించింది.
షాద్ నగర్: కన్న కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే కిరాతకురాలిగా మారింది. కాస్త రొట్టెల పిండి కింద పడేసిందని కోపం పట్టలేక చిన్నపిల్ల అని కూడా చూడకుండా కిరోసిన్ మీద పోసి నిప్పంటించింది.
ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం చింతగూడ గ్రామంలో జరిగింది. చింతగూడకు చెందిన చెన్నయ్య, దొబ్బ స్వరూప దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
రోజూ మాదిరిగానే రాత్రి రొట్టెలు చేసేందుకు పిండి తీసుకురమ్మని స్వరూప తన కూతురు రాధిక(10)ను కిరాణా షాపుకు పంపింది. పాపం, ఆ పిల్ల పిండి తెస్తుండగా అనుకోకుండా కొంత పిండి కింద పడిపోయింది.
ఇది తెలియగానే స్వరూప అగ్గి మీద గుగ్గిలమే అయింది. కూతుర్ని చితకబాదింది. అంతటితో ఊరుకోకుండా ఇంట్లోకి వెళ్ళి కిరోసిన్ తీసుకొచ్చి చిన్నపిల్ల అని కూడా చూసుకోకుండా రాధికపై పోసి నిప్పటించింది.
ఇది గమనించిన స్థానికులు పరుగుపరుగున వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. వెంటనే 108 అంబులెన్స్ కు కాల్ చేసి, తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆ చిన్నారిని షాద్ నగర్ లోని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. కానీ రాధిక పరిస్థితి విషమంగా మారడంతో అక్కడ్నించి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.