బిగ్ రిలీఫ్.. తెలంగాణాకు చేరిన రుతుపవనాలు.. నేడు ఈ జిల్లాలలో వర్షాలు!
ఎండల తీవ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం మధ్యాహ్నం ఈ రుతుపవనాలు తెలంగాణ దక్షిణ సరిహద్దు ప్రాంతమైన జోగులాంబ గద్వాల జిల్లాను తాకినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
తెలంగాణాకు చేరిన నైరుతి రుతుపవనాలు
ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉండటంతో, రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించనున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గాలుల వేగాన్ని బట్టి జూన్ 11 లేదా 12 నాటికి ఇవి హైదరాబాద్ మహా నగరానికి కూడా చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత
ప్రస్తుతం ఒకవైపు రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకగా.. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సమాంతరంగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరగనుంది.
నేడు ఈ జిల్లాలలో వర్షాలు
దీనివల్ల నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని అన్నారు.
జూన్ 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఇలా
జూన్ 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఇలాగే చల్లగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెద్దవీడు గ్రామంలో 11.1సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అలాగే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచులూరులో 8.7సెంటీమీటర్లు, మహేశ్వరంలో 7.3సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా दाమరచర్లలో 7.2సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
కొన్ని గంటల్లో ఈ జిల్లాలలో వర్షాలు
తాజా వాతావరణ బులిటెన్ ప్రకారం.. రాబోయే కొన్ని గంటల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో పడే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి, ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు వెల్లడించడంతో అటు ప్రజలు, ఇటు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications