కాచిగూడలో భారీ చోరీ: నమ్మి పిలిస్తే.. ఇల్లు గుళ్ల చేశాడు, నిందితుడి కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్: నగరంలోని కాచిగూడలో భారీ చోరీ జరిగింది. తమకు సహాయకంగా ఉంటాడని భావించి తెచ్చుకున్న ఓ వ్యక్తి ఆ కుటుంబాన్ని మోసం చేసి తిన్న ఇంటికి కన్నం వేశాడు. భారీ మొత్తంలో బంగారు, వెండి నగలను అపహరించుకుపోయాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడ టూరిస్ట్ హోటల్ చౌరస్తాలోని గోకుల్ధామ్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 205లో వ్యాపారి విజయ్ కాలే(72), ఆయన భార్య ఛాయా కాలే(62) నివాసం ఉంటున్నారు. ఇటీవల విజయ్ కాలే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను హైదర్గూడలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.
కాగా, చికిత్స తీసుకుంటు విజయ్ కాలేకు సహాయకంగా ఉంటాడని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నందగోపాల్(32) అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నారు కాలే దంపతులు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఇంటిని శుభ్రం చేసేందుకు నందగోపాల్కు ఛాయా కాలే తాళాలు ఇచ్చి పంపింది. అతడు 11.30 గంటలకు తిరిగి ఆస్పత్రికి వచ్చి తాళాలు ఇచ్చాడు. ఇక ఆ తర్వాత బయటికి వెళ్లిన నందగోపాల్ తిరిగిరాలేదు.
గురువారం రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్లిన ఛాయా కాలే.. బీరువా తెరిచి ఉండటాన్ని గమనించింది. వెంటనే బీరువాలో చూడగా అందులోని రూ. 50 లక్షల విలువైన 80 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి కనిపించలేదు. ఇది నందగోపాల్ పనే అని భావించిన ఛాయా కాలే.. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు పోలీసులు. నిందితుడు నందగోపాల్ డుప్లికేట్ తాళం చెవితో బీరువాను తెరిచి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ భారీ చోరీ స్థానికంగా కలకలం సృష్టించింది.